– టాటా, దస్సాల్ట్ ఏవియేషన్ ఒప్పందం
ముంబయి: భారత వైమానిక దళంలో కీలకంగా ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన పరికరాల తయారీ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్లు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు కంపెనీలు భారత్, ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం రాఫెల్ యుద్ధ విమానాల ను సరఫరా చేయడానికి నాలుగు ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాఫెల్ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్లోని టీఏఎస్ఎల్లో తయారు చేయాలని నిర్ణయించాయి. ఫ్రాన్స్ వెలుపల రాఫెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఈ తయారీ కేంద్రం భారతదేశ ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల్లో కీలకమైన పెట్టుబడికి ప్రాతినిధ్యం వహిస్తుందని డసో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2027-28 నాటికి ఫ్యూజ్లేజ్ అసెంబ్లింగ్ లైన్, ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ ఏర్పాట్లు చేయనుంది. నెలకు రెండు ఫ్యూజ్లేజ్లను అందించనున్నారు. భారత్లో తమ ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఇది నిర్ణయాత్మక అడుగు అని భారత రక్షణ రంగంలో తమ సేవలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలని డసో ఏవియేషన్ చైర్మెన్ అండ్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాఫెల్ విస్తరణకు మరింత దోహదం చేస్తుందన్నారు. అంతేకాకుండా నాణ్యమైన సేవలు అందించడంతో పాటుగా సైనిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. భారత రక్షణ రంగ చరిత్రలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుకరన్ సింగ్ తెలిపారు. డసో ఏవియేషన్ సంస్థతో చేసుకున్న ఈ ఒప్పందం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సామర్థ్యాలను గుర్తు చేస్తుందన్నారు.
హైదరాబాద్లో రాఫెల్ విడిభాగాల తయారీ
- Advertisement -
- Advertisement -