నవతెలంగాణ-హైదరాబాద్: హర్యానా, మహారాష్ట్రల ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికి అందిస్తారో చెప్పగలరా అని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్నికల కమిషన్ (ఇసీ)ని ప్రశ్నించారు. హర్యానా, మహారాష్ట్రలకు సంబంధించిన ఓటర్ల జాబితా డేటాను వెల్లడించాలన్న ఇసి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. ఈ నిర్ణయం ” గొప్ప మొదటి అడుగు” అని అన్నారు. ఎన్నికల సమాచారాన్ని డిజిటల్, మెషీన్ రీడబుల్ ఫార్మాట్లో అందించే కచ్చితమైన తేదీని ప్రకటించాలని ఇసీని కోరారు. కాంగ్రెస్ విజ్ఞప్తి మేరకు 2009 నుండి 2024 వరకు హర్యానా మరియు మహారాష్ట్రల ఓటర్ల జాబితాను వెల్లడిస్తామన్న ఇసీ ప్రకటనకు సంబంధించిన స్క్రీన్షాట్ను రాహుల్గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు ఆదివారం స్పందించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్కు రాహుల్ ఇప్పటి వరకు లేఖ రాయలేదని, సమావేశం ఏర్పాటు చేయాలని కూడా కోరలేదని పేర్కొన్నాయి. ఆయన అధికారికంగా లేఖ రాసినపుడే ఇసి స్పందిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.