నవతెలంగాణ-హైదరాబాద్: అణగారిన వర్గాల వారికి అందించాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లలో జాప్యంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, ఎస్టి, ఈబిసి, ఒబిసి, మైనారిటీ విద్యార్థుల నివాస వసతి గృహాల్లో దయనీయ పరిస్థితులను వివరిస్తూ బుధవారం ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ రెండు కీలక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అణగారిన వర్గాలకు చెందిన 90శాతం మంది విద్యార్థుల విద్యకు ఇవి ఆటంకం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దళిత, ఎస్టి, ఒబిసి, ఇబిసి మరియు ఇతర మైనారిటీ విద్యార్థుల వసతి గృహాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల బీహార్ పర్యటనలో తాను దర్భంగా జిల్లాలోని అంబేద్కర్ హాస్టల్ను సందర్శించానని, ఒక్క రూమ్లో ఆరుగురు నుండి ఏడుగురు విద్యార్థులకు బలవంతంగా కేటాయిస్తున్నారని మండిపడ్డారు. సరైన త్రాగునీరు లేదని, మెస్ సదుపాయం లేదని, లైబ్రరీ, ఇంటర్నెట్ అందుబాటులో లేవని లేఖలో పేర్కొన్నారు.
రెండవది, అణగారిన వర్గాల విద్యార్థులకు అందించే పోస్ట్ మాట్రిక్ స్కాలర్షిప్స్ అందడం లేదని అన్నారు. బీహార్లో స్కాలర్షిప్ పోర్టల్ మూడేళ్లుగా పనిచేయలేదని అన్నారు. 2021-22లో ఏవిద్యార్థికి కూడా స్కాలర్షిప్ రాలేదని లేఖలో తెలిపారు. ఆ తర్వాత కూడా స్కాలర్షిప్స్ పొందుతున్న విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గిందని, ఆర్థిక సంవత్సరం 2023లో 1.36లక్షల నుండి 2024లో 0.69 లక్షలకు తగ్గిందని పేర్కొన్నారు. స్కాలర్షిప్ మొత్తం కూడా చాలా తక్కువగా ఉందని, ఇది వారికి అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.