నవతెలంగాణ-హైదరాబాద్: 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై లేవనెత్తిన అంశాలు అవాస్తవాలు అని, ఆధారాలు లేని ఆరోపణలు చట్ట నియమాలకు విరుద్ధమని ఈసీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 24, 2024న INCకి ఇచ్చిన సమాధానంలో ఈ వాస్తవాలన్నింటినీ ECI వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం “చట్టం పట్ల అగౌరవం, అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు పూర్తిగా అసంబద్ధం” అని ECI పేర్కొంది. “ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే అది చట్టం పట్ల అగౌరవానికి సంకేతం మాత్రమే కాదు, వారి స్వంత రాజకీయ పార్టీ నియమించిన వేలాది మంది ప్రతినిధులకు అపఖ్యాతిని తెస్తుంది. ఎన్నికల సమయంలో అవిశ్రాంతంగా, పారదర్శకంగా పనిచేసే లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని నిరుత్సాహపరుస్తుంది. ఓటర్లు ఏదైనా ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత, ఎన్నికల కమిషన్ రాజీపడిందని చెప్పడం ద్వారా దానిని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించడమేనని” ఈసీ పేర్కొంది
కాగా, 2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడానికి ఒక బ్లూప్రింట్, ఆ రాష్ట్ర ఎన్నికల మాదిరిగా బీహార్ లో కూడా రిగ్గింగ్ చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన ఆయన రాసిన న్యూస్ పేపర్ ఆర్టీకల్ ను పోస్టు చేశారు. అందులో కీలక అంశాలను ఆయన లెవనెత్తారు. ఎన్నికలకు ముందే ఈసీ కమిషన్ లో సభ్యులను మార్చారని, అదే విధంగా సరైన పత్రలను లేని ఓటర్ల జాబితాలను విడుదల చేశారని రాసుకొచ్చారు. అదే విధంగా బీజేపీ పోటీ చేసే ప్రాంతాల్లో అనువ్యహాంగా బోగస్ ఓట్లను సృష్టించారన్నారు. ఆ ఓట్లతో అధికారం చేపట్టిన నేతలు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాసమస్యలను పెడచెవిన పెడుతున్నారని వివరించారు. ఆ తర్వాత ఓటింగ్ శాతంపై కూడా తేడాలొచ్చాయని ఆయన ఆరోపించారు. అదే తరహాలో బీహార్ ఎన్నికలు ఉండనున్నాయని ప్రతిపక్ష నేత రాహుల్ పేర్నొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తాజాగా ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది