Wednesday, June 25, 2025
E-PAPER
Homeజాతీయంరైల్వే టికెట్‌ ధరలు పెంపు

రైల్వే టికెట్‌ ధరలు పెంపు

- Advertisement -

– జులై 1 నుంచి అమలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

రైల్వే టికెట్‌ ధరలు పెరగనున్నాయి. జులై 1 నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. నాన్‌ ఏసీ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల టికెట్‌ ధర కిలోమీటరుకు 1 పైసా, ఏసీ తరగతి టికెట్‌ ధర కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున పెరగనున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. సబర్బన్‌ టికెట్‌ ధరలు, 500 కిలోమీటర్ల వరకు సెకండ్‌ క్లాస్‌ ప్రయాణానికి ఈ పెంపు వర్తించదు. 500 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు ఒక పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌పై ఇటీవలే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆధార్‌ అథంటికేషన్‌ ఉన్న వారికి తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. జులై 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఏసీ క్లాస్‌ బుకింగ్‌ల కోసం ఉదయం 10 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు, నాన్‌ ఏసీ క్లాస్‌ బుకింగ్‌లకు ఉదయం 11 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఈ మార్పులు అమలులోకి వచ్చిన రోజు నుంచే (జులై 1) టికెట్ల ధర పెరుగుదల కూడా అమల్లోకి రానున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. నెలవారీ సీజన్‌ టికెట్‌ ధరల్లోనూ ఎలాంటి మార్పూ ఉండబోదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.మరోపక్క ఇటీవల కాలంలో తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నా అందుకు గల కారణాలపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది. కోవిడ్‌ సమయంలో వృద్ధులు, జర్నలిస్టులతో పాటు వివిధ కేటగిరీల వారికీ రైల్వేలో కల్పిస్తున్న రాయితీ ప్రయాణ సౌకర్యాన్ని ఎత్తివేసింది. ఈ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని సంబంధిత అధికారులు, మంత్రులకు విన్నవించినా అతీగతి లేదు. రైల్వే మంత్రిత్వ శాఖ నిధుల్లో కోత విధించడంతో ప్రయాణికుల సౌకర్యాల కల్పనలో విఫలమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -