– మే 27న కేరళను తాకనున్న నైరుతి పవనాలు : ఐఎండీ
న్యూఢిల్లీ: ఈసారి దేశంలో వర్షాకాలం ముందే రానుంది. మే 27వ తేదీన నైరుతీ రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవేళ అధికారులు అంచనా వేసినట్లు ముందుగానే రుతుపవనాలు కేరళను చేరితే, అప్పుడు 2009 తర్వాత ఈ ఏడాది తొలిసారి వర్షాకాలం ముందుగా వచ్చినట్లవుతుందని ఐఎండి వెల్లడించింది. 2009 సంవత్సరంలో మే 23వ తేదీన నైరుతీ కేరళను తాకినట్లు ఐఎండీ డేటా తెలుపుతుంది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ సమయానికి కేరళలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ రుతుపవనాల వల్లే దేశంలో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత జూలై 8వ తేదీలోగా దేశవ్యాప్తంగా ఆ రుతుపవనాలు విస్తరిస్తాయి. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఆగేయ దిశ నుంచి తిరోగమనం అవుతాయి. అక్టోబర్ 15వ తేదీలోగా పూర్తిగా ఆ రుతుపవనాలు వెళ్లిపోతాయి. 2025 వర్షాకాలంలో.. సాధారణం కన్నా అధికంగానే వర్షం కురుస్తుందని ఏప్రిల్లో ఐఎండీ వివరించిన సంగతి విదితమే. ఎల్ నినో పరిస్థితులు ఉండబోవని ఐఎండీ పేర్కొన్నది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి నాలుగు నెలల్లో వర్షపాతం సాధారణ స్థాయి కన్నా ఎక్కువే ఉంటుందని ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలిపారు. ఈసారి వర్షాకాలం ముందే రానున్నదని, మే 27వ తేదీన నైరుతీ రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ తెలిపింది.
ఈసారి ముందుగానే వర్షాలు
- Advertisement -
- Advertisement -