నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్లో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రమాద ఘటనపై విచారణ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రయాణికులు తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. డోర్ తెరుచుకోలేదని తెలిపారు.
‘‘అగ్ని ప్రమాదం వల్ల బస్సు డోర్ లాక్ అయ్యింది. దీంతో తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయింది. ఏసీ స్లీపర్ బస్సులో సీట్ల మధ్య చాలా మృతదేహాలు కన్పించాయి. అంటే వారు బయటపడేందుకు ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోవడంతో అందులో చిక్కుకుపోయారని అర్థమవుతోంది’’ అని జైసల్మేర్ అదనపు ఎస్పీ కైలాశ్ దాన్ వెల్లడించారు. ఆర్మీ యుద్ధ స్మారకానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. గమనించిన ఆర్మీ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయి. వాటిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు బస్సులోనే మృత్యువాత పడ్డారని అధికారులు పేర్కొన్నారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.