నవతెలంగాణ – హైదరాబాద్: ఒక భారీ చిత్రం షూటింగ్ పూర్తిచేసి, మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మొదలుపెట్టే ముందు మానసిక ప్రశాంతత కోసం సూపర్స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటారని తెలిసిందే. తన ఆనవాయతీని కొనసాగిస్తూ ఆయన మరోసారి హిమాలయ యాత్ర చేపట్టారు. ‘కూలీ’ చిత్రం చిత్రీకరణను ఇటీవల ముగించుకున్న ఆయన, ‘జైలర్ 2’ షూటింగ్ ప్రారంభానికి ముందు వారం రోజుల పాటు హిమాలయాల్లో గడపనున్నారు.
ఈ యాత్రలో భాగంగా రజినీకాంత్ రిషికేశ్లోని ఆశ్రమంలో బస చేస్తూ బద్రీనాథ్, మహావతార్ బాబాజీ గుహ వంటి పవిత్ర స్థలాలను దర్శించుకున్నారు. హిమాలయాల ప్రకృతి సౌందర్యం నడుమ ఆయన ధ్యానంలో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎంతో సింపుల్ గా ఉన్న రజనీ… రోడ్డు పక్కన అల్పాహారం తీసుకుంటూ కనిపించారు.
ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం వల్ల ఒక కొత్త అనుభవం లభిస్తుంది. ప్రపంచమంతటికీ ఆధ్యాత్మికత చాలా అవసరం. అదే మనిషికి తృప్తిని, ప్రశాంతతను ఇస్తుంది” అని పేర్కొన్నారు. భగవంతుడిపై విశ్వాసం జీవితంలో సమతుల్యతను అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.