నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్లోని భుజ్లో భారత వైమానిక దళం (ఐఎఎఫ్) స్థావరాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ శుక్రవారం ఉదయం సందర్శించారు. ఆయనతో పాటు వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్ కూడా ఉన్నారు. పాక్ దాడులను తిప్పికొట్టిన సైనికులను ఆయన అభినందించారు. భారత ప్రజల తరపున మన సైన్యం మనకు గర్వకారణం అనే సందేశాన్ని తీసుకువచ్చానని అన్నారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు, ఆపరేషన్ సిందూర్ సమయంలో మాతృభూమి సేవలో వీరమరణం పొందిన సైనికులకు కూడా రక్షణమంత్రి నివాళులర్పించారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, పాకిస్తాన్ భుజ్ ఐఎఎఫ్ స్థావరం లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. స్థావరాలకు ఎలాంటి హాని జరగకుండా భారత వైమానిక దళం వాటిని తిప్పికొట్టింది. భుజ్లోని భూకంప స్మారకచిహ్నం స్మృతివన్, మ్యూజియంను కూడా సందర్శించనున్నారు. 2001, జనవరి 26న భుజ్లో సంభవించిన భూకంపంలో మరణించిన ప్రజల స్మారకచిహ్నంగా స్మృతివన్ను నిర్మించారు.
రాజ్నాథ్ సింగ్ గురువారం జమ్ముకాశ్మీర్లోని శ్రీనగర్లో బాదామి బాగ్ కాంట్ స్థావరంలో పర్యటించారు. జమ్ముకాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఒసి) మరియు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు.