నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ పై రోజురోజుకు దాడులను ఇజ్రాయిల్ ఉధృతం చేస్తోంది. కెర్మాన్షా ప్రాంతంలో 15 యుద్ధ విమానాలతో ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ స్థావరాలను ఇజ్రాయిల్ వాయుసేనలు ధ్వంసం చేశాయి. పలు బాలిస్టిక్ క్షిపణులను నిల్వ చేసిన ప్రాంతాలను, ప్రయోగ స్థావరాలను ఈ దాడుల్లో విజయవంతంగా ధ్వంసం చేశామని పేర్కొంది.
మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులతో ఇజ్రాయిల్ సేనలను నిలువరిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఓ డ్రోన్ను ఖోరామాబాద్ ప్రాంతంలో ఇరాన్ కూల్చివేసింది. ఇరాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించగా.. ఐడీఎఫ్ కూడా ధ్రువీకరించింది. అది హెర్మ్స్ రకం డ్రోన్ అని ఇరాన్ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్లోని విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
దక్షిణ ఇజ్రాయెల్లోని వ్యూహాత్మక విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ తెలిపింది. ఈ కారణంగా పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయని పేర్కొంది. ‘ఆ ప్రాంతాల్లో వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరమ్మతులు చేపడుతున్నాం. అయితే.. భద్రతా కారాణాల రీత్యా.. సెక్యూరిటీ ఫొర్సెస్తో సమన్వయం చేసుకుంటూ ఈ పనులు చేపడుతున్నాం’’ అని ఎలక్ట్రిక్ కార్పొరేషన్ వెల్లడించింది.