నవతెలంగాణ-హైదరాబాద్: రేషన్ బియ్యం’ కారణంగా ఓ తల్లి, కొడుకు కలిశారు. అదేంటి అని ఆశ్యర్యపోతున్నారా? ఏడేళ్ల క్రితం తప్పిపోయిన మతిస్థిమితం లేని తన కుమారుడి కోసం.. ఎంత వెతికినా దొరకలేదు. చివరకు తన కుమారుడు దొరకడని.. ఆశలు చంపేసుకుని ఓ తల్లి జీవనం సాగిస్తుంది. అయితే ఏడేళ్ల తర్వాత అనూహ్యంగా రేషన్ బియ్యం వల్ల తల్లీ.. కొడుకు కలిశారు. ఈ ఆశ్చర్యకర, ఊహించని ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆదోనికి చెందిన వడ్డే శివశంకర్, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్. మతిస్థిమితం సరిగా లేని శ్రీకాంత్.. తన 11వ ఏట 2018లో స్వగ్రామమంలో తప్పిపోయాడు. శ్రీకాంత్ ట్రైన్లో విజయవాడకు వెళ్లాడు. అక్కడ విజయవాడ రైల్వే పోలీసుల కంటపడ్డాడు. మొదట పోలీసులు శ్రీకాంత్ ను చైల్డ్ కేర్ అధికారులకు అప్పగించారు. వారికి శ్రీకాంత్ వివరాలు ఏమి చెప్పకపోవడంతో.. విజయవాడ కలెక్టర్ ఉయ్యూరులోని ఓ రిహాబిలిటేషన్ సంస్థలో చేర్పించారు. బాలుడు టీబీతో బాధపడుతుండడంతో రిహాబిలిటేషన్ సంస్థ సిబ్బంది గుంటూరు ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం శ్రీకాంత్ తన జీవితాన్ని పునఃప్రారంభించాడు.
టూ టౌన్ పీఎస్లో శ్రీకాంత్పై మిస్సింగ్ కేసు నమోదు అయింది. బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో 2023లో పోలీసులు కేసును క్లోజ్ చేశారు. తాజాగా రేషన్ బియ్యం కోసం రేషన్ షాపు వద్దకు శ్రీకాంత్ తల్లి లక్ష్మి వెళ్లగా.. మీ రేషన్ ఉయ్యూరులో తంబ్ వేసి తీసుకెళ్లారని డీలర్ చెప్పాడు. డీలర్పై లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డీలర్ను విచారించగా.. రేషన్ బియ్యాన్ని ఉయ్యూరులో తంబ్ వేసి తీసుకెళ్లినట్లు చెప్పాడు. రెవిన్యూ అధికారుల సహకారంతో పోలీసులు విషయం తెలుసుకున్నారు. టూ టౌన్ పోలీసులు తప్పిపోయిన కొడుకుని తల్లి వద్దకు చేర్చారు. 11వ ఏట తప్పిపోయిన శ్రీకాంత్.. 18వ ఏట రేషన్ బియ్యం తీసుకుని తల్లి వద్దకు చేరుకున్నాడు. రేషన్పై ఫిర్యాదు చేయడానికి వస్తే.. కొడుకుని చెంతకు చేర్చారని లక్ష్మి అధికారులకు కృతజ్ఞతలు చెప్పింది.