మన దేశంలో రెండు పాతకాలున్నాయి.
1. స్త్రీలను అణగదొక్కడం.
2. పేద బహుజనుల్ని కుల నిబంధనలతో రాచి రంపాన పెట్టడం. – స్వామి వివేకానంద.
హిందూ మతోద్ధారకుడని చెప్పుకుంటున్న వివేకానందుడి మాటల్లోని సారాంశాన్ని మనువాద సమాజం, ప్రభుత్వాలూ పట్టించుకోవా? ఏ విషయంలోనైనా ఎంత నిజం ఉంది? అన్న విషయం చూడాలేగానీ, విషయం మనకు అనుకూలంగా ఉందా లేదా అన్నది చూడడం కుత్సితబుద్ది అవుతుంది కదా? ఒక్కోసారి అబద్దాలు మనకు అనుకూలంగా ఉండొచ్చు. అంతమాత్రం చేత అబద్దాల్ని ఊరేగిస్తూ తిరుగుతామా? అంటే, ఈ దేశంలో మనువాదులు శతాబ్దాలుగా అలాగే తిరుగుతున్నారు మరి! మనువాద భావజాలానికి కట్టుబడి పనిచేస్తున్న మన కేంద్ర ప్రభుత్వమే అలా తిరుగుతోంది కదా? స్వామి వివేకానంద ఎత్తిచూపిన ఆ రెండు పాతకాలను పాతరేయడానికే కదా మహాత్మా జోతిరావు ఫూలే నడుం బిగించి సంఘర్షించాడూ? అవిశ్రాంతంగా పోరాడిన మహత్తర విప్లవశక్తి జోతి బా ఫూలే! ఆయన ఎందుకు పోరాడాడు? స్వప్రయోజనాల కోసం కాదు, దేశాన్ని సర్వతోముఖంగా అభివద్ధి చేయడానికి! అందుకే రాటుదేలిన ఆచరణవాదిగా మారిపోయాడు.
1827లో మహారాష్ట్రలో ‘మాలి’ కుటుంబంలో పుట్టిన ఫులేకు స్వతంత్ర దష్టి, ఆధునిక అవగాహన ఉండేవి. ఆయన తన ఇరవై ఒకటవయేట ఒక బ్రాహ్మణ మిత్రుడి పెండ్లి ఊరేగింపులో పాల్గొన్నందుకు, వారు అతన్ని ఘోరంగా నిందించి, అవమానించారు. ఊరేగింపు నుంచి గెంటేశారు. అవమాన భారంతో బయటికి వచ్చినా, తను చేయదలుచుకున్న పోరాటం ఎంత జటిలమైందో అప్పుడే ఆయనకు అర్థమైంది. అగ్రవర్ణం వారికీ శూద్రులకు మధ్య ఇంత వ్యత్యాసమెందుకు? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. మానవ జాతి అంతా ఒక్కటే అయినప్పుడు మనుషులందరి స్థాయి ఒక్కటిగా ఎందుకు లేదూ? అని పరితపించిపోయాడు.
”బ్రాహ్మణులు తమ మత గ్రంథాలను బయటికి తీయాలి. అందరూ కలిసి బహిరంగంగా చదవాలి!” – అని జోతిరావు ఫూలే ఒక సవాలు విసిరాడు. క్రైస్తవులు బైబిల్ కలిసి చదివినట్లు, అందరితో కలిసి బహిరంగంగా చదవితే వాటిలో ఉన్న అసమానత, అన్యాయం, వివక్ష బయటపడతాయన్నది ఆయన ఆలోచన – అని, రచయిత ధనుంజరు కీర్ ”మహాత్మా జోతిరావు ఫులే” శీర్షికతో వెలువరించిన గ్రంథంలో (పేజి: 169) ప్రకటించారు. ధనుంజరు కీర్ అనే రచయిత మహాత్మా జోతిబా ఫూలే సామాజిక పోరాటం, జీవితము-రచనలు వంటి విషయాలపై పరిశోధన చేసి ప్రకటించిన గ్రంథమే ”మహాత్మా జోతిరావు ఫూలే! ఆ గ్రంథంలోని విషయాల ఆధారంగానే నేనిక్కడ కొన్ని విషయాలు ఊటంకిస్తున్నాను. క్రైస్తవ, ముస్లిం మతగ్రంథాల్లో చెడులేదని కాదు. అయినా, వారు సామూహికంగా బహిరంగంగా చదవగలుగుతున్నారు. హిందువులు – ముఖ్యంగా అగ్ర కులస్తులైన బ్రాహ్మణుల పరిస్థితి వేరు. వీరికి వాస్తవాల్ని అంగీకరించే ధైర్యం లేదు. స్మతులు, శాస్త్రాలు ఇస్తున్న ప్రయోజనాలు వదులుకునే ఔదార్యం లేదు. పక్షపాత పూరితమైన గ్రంథం కాబట్టే డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ ‘మనుస్మతి’ని ధైర్యంగా తగలబెట్టారు. ఎందుకూ? అంటే శాస్త్రాల పేరుతో కొనసాగుతున్న బ్రాహ్మణ అధిక్యతను తొలగించడానికే!
మహాత్మా ఫూలే 1848లో కొన్ని పాఠశాలలు ప్రారంభించాడు. అది సమాజంలో ఒక భూకంపానికి దారితీసింది. నిరుపేద పిల్లల్ని పాఠశాలకు రప్పించడానికి వారికి తినుబండారాలు ఇచ్చి ఆకర్షించాల్సి వచ్చేది. నీరుపేద పిల్లలకు ఒంటిమీద గుడ్డలు కూడా ఉండేవి కావు. అలాంటి వారికి ఫూలే బట్టలు కుట్టించాల్సివచ్చేది. మళ్లీ వాళ్లను జాగ్రత్తగా వారి ఇండ్లలో దిగబెట్టాల్సి వచ్చేది. పులే దంప తులు ఈ పనులన్నీ ఓపికగా చేస్తూ వచ్చారు. అయితే అప్పుడు వారికి అత్యవసరంగా ఒక మహిళా ఉపాధ్యాయిని కావల్సి వచ్చింది. ఎందుకంటే, బాలికలకు-మహిళలకు జోతిబా ఫూలే చదువు చెప్పలేడు. ఒక పర పురుషుడి ఎదురుగా మహిళలు కూర్చునే అవకాశం లేదు. ఇది కూడా మనువాద సంస్కతి పెట్టిన కట్టడే. జోతి బాకు తన ఇంట్లోని అమ్మాయిని అంటే, తన భార్య సావిత్రి బాయి ఫులేను ఉపాధ్యాయినిగా తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. అగ్రకుల మహిళలకే చదువుకునే అవకాశాలు లేని రోజుల్లో – జోతి బా ఫూలేతన భార్య సావిత్రి బాయిని మొదటి మహిళా ఉపాధ్యాయినిగా, మొదటి శూద్ర మహిళా ఉపాధ్యాయురాలిగా తయారు చేశాడు. ఆమెతో టీచర్ ట్రెయినింగ్ కూడా చేయించాడు. ఆ సమయంలోనే మనువాద పెత్తందార్లు జోతిబా ఫూలే తండ్రిని బెదిరించారు. కొడుకును, కోడలిని ఇంట్లోంచి గెంటేయాలని ఒత్తిడి పెంచారు. తన తల్లిదండ్రులు ప్రశాంతంగా జీవించాలని, జోతిబా, భార్య సావిత్రిని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయాడు. పెత్తందార్లు అంతటితో సంతప్తి చెందారా? లేదు. పాఠశాలలు కూడా మూయించారు.
ఒకరకంగా గృహ బహిష్కరణకు గురైన ఆ యువ ఫూలే దంపతులు ధైర్యం కోల్పోలేదు. వారి ధ్యేయం మరువ లేదు. క్రమంగా నిలదొక్కుకుని మిత్రుల, శ్రేయోభిలాషుల సహాయ సహకారాలతో మళ్లీ ముంబై రెండు పాఠశాలలు తెరిచారు. వాటిని అమోఘంగా నిర్వహించారు. మరోవైపు.. తాము అనుకున్నది సాధించలేకపోయామని మనువాద పెత్తందార్లంతా కక్ష పెంచుకున్నారు. సావిత్రిబాయి ఫూలే పాఠశాలకు వెళ్లేదారిలో అనేక రకాలుగా అడ్డుకునేవారు. ఆమె మీద మట్టి గడ్డలు, రాళ్లు విసిరే వారు. పేడ, బురద వేయించేవారు. అగ్రకుల పురుషులు దాడులు చేస్తుండేవారు. అప్పుడు ఆమెకు రక్షణగా జోతి బా ఫూలే ఒక మనిషిని ఏర్పాటు చేశాడు. ఆ రోజుల్లో సావిత్రిబాయి సంచిలో మరొక చీర జాకెటు పెట్టుకుని వెళ్లేది. పాఠశాల గదిలో చీర మార్చుకుని పిల్లలకు పాఠం చెప్పేది. సాయంత్రం ఇంటికి వెళ్లేప్పుడు పేడ, బురద మరకలున్న పొద్దుటి చీరే మళ్లీ కట్టుకుని వెళ్లేది. తొలిదశలో జోతి రావు ఫూలే ఇంటి వద్దే భార్యకు పాఠాలు బోధించి, ఆమె పిల్లలకు చెప్పగలదని నమ్మకం కలిగాక ఆమెను పాఠశాలకు పంపేవాడు. ఆరకంగా ఆ దంపతులు ఎదుర్కొన్న కష్టాలు, కుంగిపోక ఆత్మస్థైర్యంతో నిలబడ్డ తీరు చాలా గొప్పది. అందువల్లనే జోతిబా మహాత్ముడు కాగలిగాడు. సావిత్రిబాయి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయిని కాగలిగింది.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా జోతి బా తన కార్యక్రమాలు ఆపడం లేదని రగిలిపోయిన మనువాద పెత్తందార్లు మరిన్ని కుట్రలు పన్నటం ప్రారంభించారు. చివరకు ఆయన్ను చంపించాలని పథకం వేశారు. రామోజీ, దొండే రామ్ అనే ఇద్దరు గుండాలకు దండిగా డబ్బు ఆశచూపి, ఒక అర్ధరాత్రి జోతిబా ఫూలే ఇంటి మీదికి పంపించారు. వేల సంవత్సరాల క్రితం బుద్ధుడు అంగుళీ మాలుణ్ణి ఎదుర్కున్నట్టు- ఫూలే కూడా అర్ధరాత్రి కత్తులతో జొరబడ్డ గుండాల్ని ఎదుర్కున్నాడు. ఆవేశపడకుండా, భయపడకుండా, నిశ్చలంగా, నిబ్బరంగా వారితో మాట్లాడాడు. ”నా చావు మీకు ఉపయోగపడితే రండి. చంపండి” -అని ఎదురుగా నిలబడ్డాడు. నేను పేద వర్గాల కోసం ఆహారాత్రులు శ్రమించడం మీకు నచ్చకపోతే రండి చంపండి” -అన్నాడు. వచ్చిన ఆ గుండాలు పేదవర్గానికి చెందిన వారే. తమ బాగుకోసం శ్రమిస్తున్న వాణ్ణి చంపుదామని వచ్చామా? ఎంత నీచం? – అని వారిలో పరివర్తన కలిగింది. గుండాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని గబుక్కున ఫూలే కాళ్లమీద పడ్డారు. పశ్చత్తాపంతో క్షమించమని వేడుకున్నారు. జోతి రావు వారిని క్షమించి, పైకి లేపి, దగ్గరకు తీసుకుని మరి కొన్ని మంచిమాటలు చెప్పాడు. వారిని తన ఆలోచనా విధానంలోకి మార్చుకున్నాడు. ఆ ఇద్దరిలో ఒకరు రాడ్ రామోజి ఫూలేకు అంగరక్షకుడయ్యాడు. మరొకరు దొండే రామ్ నామ్ దేవ్ కుంబర్ రచయితగా మారి, ఫూలే సిద్ధాంతాలు, ఆశయాలు ప్రచారం చేశాడు.
జోతి రావు ఫూలే ఎన్నిక చేసిన రచనలు (రవశ్రీవష్వస షతీఱ్ఱఅస్త్రర శీట జీyశ్ీఱ =aశీ ూష్ట్రబశ్రీవ) పేజి 235లో ఆయన ఇలా రాశారు, ”ఇరాన్కు చెందిన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు భారతదేశంలోని బంగారంపై కన్నేసి, సంయుక్త కూటమిగా ఏర్పడి మన వ్యవసాయ దేశాన్ని పలుమార్లు ముట్టడించారు. స్థానికులను హింసించారు. చివరకు కొందరి చర్మం కూడా ఒలిచారు -” అని ఫూలే స్పష్టంగా రాసాడు. ఈ ఇరానియన్లు స్థానికుల్లో కొందరిని పాతాళలోకానికి అంటే అమెరికాకి తరిమేశారు. (గ్లోబ్లో ఇండియాకు అటువైపు అంటే అడుగున అమెరికా ఉంటుంది గనక, అది పాతాళ లోకమని కొందరు మనువాదుల భావన) ఇక ఇక్కడ మిగిలిన అధిక సంఖ్యాకుల్ని బానిసలుగా, అంటరానివారిగా మార్చేశారు. తరువాత కుల వ్యవస్థను విశ్వసించని ముస్లింలు, ఆ తర్వాత వందల ఏండ్లకు క్రైస్తవులు (బ్రిటిష్ వారు) దేశం మీద అధికారం చేపట్టారు. ఈ విషయాలన్నీ ఫూలే తన రచనల్లో నమోదు చేశాడు.
ఈ దేశంలో మనువాద బ్రాహ్మణ సమాజం ఫూలే సినిమానే కాదు. దేన్నయినా వివాదాస్పదం చేయగలదు. శతాబ్దాలుగా వారు చేస్తున్న పని అదేకదా? బౌద్ధాన్ని, జైనాన్ని నాశనం చేయడం, ముస్లింలను ద్వేషించమని చెప్పడం వారికి మామూలే ! బ్రాహ్మణా ధిక్యతను వదిలేసి, మనుషులుగా ఆలోచించి, మను షుల్లో కలిస్తే అందరికీ బావుంటుంది. సంఘ సంస్కర్తలు బహుజనుల్లోంచే కాదు-బ్రాహ్మణుల్లోంచి కూడా వచ్చారు. కనీసం ఆవిషయమైనా గుర్తించుకుంటే బావుంటుంది. మహా రాష్ట్రకు చెందిన బ్రాహ్మణ సంఘ సంస్కర్త డి.కె. కర్వే గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. జోతి రావు ఫూలే జన్మిం చిన తర్వాత, 27 ఏండ్లకు జన్మించిన ధోండో కేశవ కర్వే (18 ఏప్రిల్ 1858- 9 నవంబర్ 1962) నూటా నాలుగేండ్లు జీవిం చాడు.వందేండ్లు దాటిన తర్వాత భారత ప్రభుత్వం భారతరత్న (1958) ఇచ్చి గౌరవించుకుంది. ఎన్నో విశ్వవిద్యాలయాలు ‘మహా మహోపాధ్యాయ’ బిరుదునిచ్చాయి. పూనే ఫర్గూస్సన్ కాలేజిలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తూ అనాధ బాలికలకు, వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పాడు. తను స్వయంగా ఒక వితంతువుని వివాహమాడి, ఎన్నో వితంతు వివాహాలు జరిపించాడు. పూర్తిగా జోతి రావు ఫూలే చేపట్టిన కార్యక్రమాలన్నీ చేపట్టాడు. ప్రజలు ఆయన్ను ‘మహర్షి’- అని పిలుచుకున్నారు. మహారాష్ట్రులనే కాదు మన తెలుగునాట కూడా కందుకూరి, గోపరాజు రామచంద్రరావు (గోరా) వంటి బ్రాహ్మణ సంఘ సంస్కర్తలున్నారు. కుత్సిత బుద్ది వీడి అలాంటి వారిని అనుసరించాలి.
స్థూలంగా జోతి రావు ఫూలే మూడు విషయాలు చెప్పాడు. 1.సత్యమొక్కటే – ప్రపంచమంతా ఉన్న మతం 2. సామాజిక ప్రజాస్వామ్యం అత్యంత ప్రధానం 3. స్త్రీలు పురు షుల కన్నా ఉన్నతులు. ఆయన స్థాపించిన సత్యశోధక్ సమాజ్ గురించి, ఆయన నెలకొల్పిన వితంతు శరణాలయాల గూర్చి ఈరోజు అందరికీ తెలుసు. బ్రాహ్మణుడు లేకుండా అంటే సంస్కృత మంత్రాలు లేకుండా కేవలం ప్రమాణాలతో ఆయన ఆనాడు జరిపించిన పెండ్లిళ్లు నేటి ఆధునిక కాలానికి ఆదర్శమ య్యాలు. ఆయన శరణాలయంలో రహస్యంగా పురుడు పోసు కుని, ఒక వితంతువు వదిలేసిపోయిన శిశువును ఫూలే దంప తులు దత్తత తీసుకుని, పెంచుకున్నారు. అతడే యశ్వంత్రావు ఫూలే. ఇంత గొప్ప వ్యక్తిత్వమున్నవాడు గనకనే – జోతిరావు నిజమైన మహాత్ముడు, మహానుభావుడు” అని గాంధీజీ కొనియాడారు.
- – త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలిగ్రహీత.
- డాక్టర్ దేవరాజు మహారాజు