నవతెలంగాణ-హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రా, సిర్మౌర్, మండి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, చంబా, సోలన్, సిమ్లా, కులు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 260కి పైగా రోడ్లను మూసివేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా ఆస్థి నష్టం జరిగింది. సుమారు 500 కోట్ల రూపాయల మేర నష్టం జరిగి ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 69 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఆకస్మిక వరదలకు 40 మంది గల్లంతయ్యారు. వరదల వల్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.