Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయంప్రజలను పోరాటమార్గాన నడిపించేది ఎర్రజెండానే

ప్రజలను పోరాటమార్గాన నడిపించేది ఎర్రజెండానే

– సీనియర్‌ నాయకులు చెరుపల్లి సీతారాములు
– ప్రజా సమస్యలపై భువనగిరిలో భారీ ర్యాలీ
– వందలాది మందితో కలెక్టరేట్‌ వరకు సీపీఐ(ఎం) ప్రదర్శన, మహాధర్నా
నవతెలంగాణ -భువనగిరి కలెక్టరేట్‌

నిరంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేది.. ప్రజలను పోరాటాల్లో పాల్గొనేలా చైతన్యం చేసేది ఒక్క ఎర్రజెండానే అని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ప్రజాసమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం నుంచి వందలాది మందితో ప్రారంభమైన పాదయాత్ర జిల్లా కలెక్టరేట్‌ వరకు ఐదు కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లింది.
అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్‌ పదేండ్ల కాలంలో అనేక హామీలు ఇచ్చి సక్రమంగా అమలు చేయక ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ రావాల్సిన వాటాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పహల్గాంలో జరిగిన దాడి కేంద్ర ప్రభుత్వ రక్షణ విభాగానికి సంబంధించిన నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌ మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే చిన్న నీటి ప్రాజెక్టులు బస్వాపూర్‌ రిజర్వాయర్‌, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని, గంధమల్ల, శివన్నగూడెం రిజర్వాయర్లకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్యం కరువైందని, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక, అందుబాటులో ఉన్న ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యం అందక గాంధీ, ఉస్మానియాలాంటి ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు నిర్ణయించిన వారికి కాకుండా గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించి ఇండ్లు, రేషన్‌ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసాచారి, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, సిర్పంగి స్వామి, బొడ్డుపల్లి వెంకటేశం, ఎండి పాషా, బొల్లు యాదగిరి, గంగదేవి సైదులు,మద్దెల రాజయ్య, గడ్డం వెంకటేష్‌, ఎంఎ ఇక్బాల్‌, వనం ఉపేందర్‌, కోట రామచంద్రారెడ్డి, రాగీరు కిష్టయ్య, బల్గురి అంజయ్య, గోశిక కరుణాకర్‌ నాయకులు గూడూరు అంజిరెడ్డి, దొంతగాని పెద్దలు, ధోనురి నర్సిరెడ్డి, మంగ నరసింహులు, కళ్లెం సుదర్శన్‌ రెడ్డి, మండల కార్యదర్శులు దూపటీ వెంకటేష్‌, పల్లెర్ల అంజయ్య, గాడి శ్రీనివాస్‌, పోతరాజు జహంగీర్‌, ర్యకాల శ్రీశైలం, కొల్లూరి ఆంజనేయులు, మునుకుంట్ల లెనిన్‌, దుబ్బాక జగన్‌, ప్రజాసంఘాల నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, పల్లె మధుకృష్ణ, వడ్డేబోయిన వెంకటేష్‌, కవిడే సురేష్‌, వనం రాజు, లావుడియా రాజు, గంటెపాక శివ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img