– ప్రభుత్వంలో ఉండి ధైర్యంగా ప్రశ్నించింది నేనే..
– నా ప్రాంత ప్రజల జోలికి వస్తే ఊరుకోను :ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నవతెలంగాణ-జన్నారం
జీవో 49ను పునరుద్ధరిస్తే రాజీనామా చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పష్టం చేశారు. కవ్వాల్ టైగర్ జోన్లో పోడు రైతు లు, అడవి బిడ్డల రాకపోకలపై ఆంక్షలు విధించడం పై అటవీశాఖ అధికారులను హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని జ్యోతి గార్డెన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు రైతులపై అటవీశాఖ అధికారులు ఆంక్షలు పెడితే ఊరుకునేది లేదన్నారు. ప్రజలు, గిరిజనులతో కలిసి తరిమి కొడతామంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. జీఓ నంబర్ 49ని తిరిగి అమలులోకి తెస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ప్రభుత్వంలో ఉండి కూడా ఇంత ధైర్యంగా ప్రకటించింది తానేనని అన్నారు.
నా ప్రాంత ప్రజల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అలాగే, కవ్వాల్ టైగర్ జోన్లో భారీ వాహనాల రాకపోకలపై ఉన్న నిషేధం ఎత్తేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదవాడినైన తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. టైగర్ జోన్, భారీ వాహనాలపై అటవీ ఆంక్షల విషయంలో కూడా తగ్గేది లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వారికి అందించడంలో అధికారులు ముందుండా లని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, మార్కెట్ కమిటీ చైర్మెన్ దుర్గమ్మ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మెన్ ఫసిఉల్లా, పీఏసీఎస్ చైర్మెన్ అల్లం రవి, తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి, ఎంపీడీఓ ఉమర్ షరీఫ్, డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జీఓ 49ను పునరుద్ధరిస్తే రాజీనామా చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES