Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజినిర్బంధానికి ప్రతిఘటన తప్పదు!

నిర్బంధానికి ప్రతిఘటన తప్పదు!

- Advertisement -

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ‘సోనియాగాంధీ ఆరు గ్యారంటీలకు హామీనిస్తే, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి ఏడో గ్యారంటీకి నేను హామీనిస్తున్నానని’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. 2023 డిసెంబర్‌ 7న ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తుంటే, మరోవైపు ప్రగతి భవన్‌కు గతసర్కార్‌ వేసిన ముండ్లకంచెలను తొలగిస్తూ ఇదే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ప్రకటించుకు న్నారు. కానీ, ఇటీవల జరిగిన పరిణామాలను కొన్ని పరిశీలిస్తే అవి ఆదిలోనే అంతమైనట్లు కనిపిస్తున్నవి. కొంతకాలంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు తమకు పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న కోడిగుడ్డు బిల్లులు చెల్లించాలని, కార్మికులకు రెగ్యులర్‌గా చెల్లించే వంటబిల్లులను యు-కుబేర్‌ నుండి కాకుండా గ్రీన్‌ చానల్‌ ద్వారా నేరుగా కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లో గ్యాస్‌తో మధ్యాహ్న భోజనం వంట చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అవసరమైన గ్యాస్‌ను ఉచితంగా సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఈ ప్రధాన సమస్యల్ని పరిష్కరించాలని ఈ నెల 6న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా కమిషనర్‌ కార్యాలయం వద్ద ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వేలాదిమంది కార్మికులను అక్రమంగా అరెస్టులు చేయడంతో పాటు హైదరాబాద్‌లో రాష్ట్ర నాయకులను గృహ నిర్భంధం, ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు. కాంగ్రెసు ప్రభుత్వ వైఖరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ వైఖరికి భిన్నంగా అనిపించడం లేదు. మోడీ తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టాన్ని ఆగమేగాలపైన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ అమలు చేయడంలో అంతరార్ధమేమిటో ప్రజలు అర్ధం చేసుకోవాలి. మోడీ, రేవంత్‌రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడంలో కవల పిల్లలే. ఉద్యోగ భద్రత, పనికి తగ్గ వేతనాలు చెల్లించడం, అక్రమ తొలగింపులు తదితర అంశాలపై కార్మిక చట్టాలు అమలు, కార్మిక హక్కులను పరిరక్షిం చేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంటుందని, మరింత మెరుగైన సేవలందించి కార్మికుల పక్షాన నిలుస్తుందని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పదకొండో అంశంగా 53, 54 పేజీల్లో స్పష్టంగా పేర్కొంది. గత పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసు కుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు ప్రజల్ని, కార్మికుల్ని ఉద్యమకారుల్ని భయకం పితులను చేస్తున్నాయనడానికి ఇటీవల కాలంలో జరిగిన ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం. కాంగ్రెస్‌ మాటల కు చేతలకు పొంతనేలేదని ఈకాలంలో రుజువైంది.
అంతేకాదు, 2025 మార్చి 21న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా హమాలీ, బీడీ, భవన నిర్మాణం, ప్రయివేటు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ తదితర అసంఘటితరంగ కార్మికులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీనికి అనుమతి కోరుతూ సంబంధిత పోలీసులకు వారం రోజుల ముందే ఆ యూనియన్‌ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత పోలీస్‌ అధికారులతో ఆ యూనియన్ల రాష్ట్ర నాయకత్వం రాయభారాలు చేసింది. అనుమతిస్తామని చెప్తూనే మార్చి 20 రాత్రి 9-30 గంటల వరకు కాలయాపన చేసి అనుమతి నిరాకరించింది. ఆరోజు రాత్రి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కార్మికుల ఇళ్ళపై పడి అర్ధరాత్రి బలవంతంగా బనియన్లపై, లుంగీలపై పోలీస్‌ స్టేషన్‌లకు లాక్కెళ్లారు. హైదరాబాద్‌ చేరుకున్న కొద్దిమందిని భయభ్రాం తులకు గురిచేశారు. ఇది అత్యంత అప్రజాస్వామిక చర్య. ఇది కార్మికుల హక్కులపై జరుగుతున్న దాడికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ ఘటన ముఖ్యమంత్రి అనేక వేదికలపై నుండి, అనేక సందర్భా ల్లో మాట్లాడుతూ తమ పాలనలో ఉద్యోగులకు, కార్మికులకు, ప్రజలకు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునే హక్కును, స్వేచ్ఛను ఇచ్చా మని, నాయకుల ఇండ్లకు వెళ్లి తలుపులు బద్దలుకొట్టి అరెస్టులు చేయడం తమ ప్రభుత్వ విధానానికి వ్యతిరేక మని” అంటూనే ఇలాంటి నియంతృత్వ, అప్రజా స్వామిక చర్యలకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యపరు స్తోంది.
దీంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని రంగాల్లో ఉన్న కార్మికులకు సమాన పనికి – సమాన వేతనం వచ్చేలా చర్యలు తీసుకుని, శ్రమదోపిడీకి గురికాకుండా చర్యలు చేపడతామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో హామీనిచ్చింది. అంతేకాదు, ఆర్టీసీ ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లిస్తామని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మి నెంట్‌ చేస్తామని కూడా చెప్పింది. అంగన్‌వాడీ, ఆశా, ఐకెపి, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తించి, వేతనాలు పెంచుతామని నమ్మబలికింది. మున్సిపల్‌, గ్రామ పంచాయతీ, యూనివర్సిటీ, వైద్య ఆరోగ్య రంగాల్లో పనిచేసే వారికి వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పింది. ఈ హామీలన్నీ విస్మరించినట్టేనా? అలాగే భవన నిర్మాణ కార్మికులు, ప్రయివేటు డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ రవాణా కార్మికులు, హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందిస్తామని, బీడీ కార్మికులందరికీ రూ.2 వేల పెన్షన్‌ ఇస్తామని పేర్కొంది. బీడీ కార్మికులను ఈఎస్‌ఐ పరిధిలోకి తీసుకువస్తామని, ఎంఎంఆర్‌, డైలీవేజ్‌, కన్సాలిడేటెడ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు సమాన పనికి- సమాన వేతనంతో సహా ఇతర చట్టబద్ధ హక్కులను అమలు చేస్తామని వివరించింది. ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చింది. మరి అవన్నీ హామీలను కాంగ్రెస్‌ సర్కార్‌ నెరవేర్చిందా?అంటే లేదనే చెప్పాలి.
ఇంకా చూస్తే, 2024 డిసెంబర్‌ 17న గ్రామ పంచాయతీ కార్మికులు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసుకునేందుకు పోలీసులు అనుమతిచ్చారు. కానీ డిసెంబర్‌ 16వ తేదీ అర్ధరాత్రి ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పంచాయతీ కార్మికులను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేశారు. రైతు సమస్యలపై ఆందోళన చేసేందుకు అనుమతి కోరిన రైతు సంఘాలకు కార్యక్రమం నిర్వహణకు ముందు రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత అనుమతిచ్చారు. అప్పటికే రైతులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లలో నిర్భంధించారు. విఆర్‌ఏలు ధర్నా చేసుకునేందుకు అనుమతి సైతం నిరాకరించి ఆ సంఘం రాష్ట్ర నాయకుడి ఇంట్లో పోలీసులు చొరబడి మహిళలను, పిల్లలను భయబ్రాంతులను చేశారు. మార్చి 23న తమ సమస్యలు పరిష్కరించాలని, తమ గోడు ప్రభుత్వానికి విన్నవించుకోడానికి వచ్చిన ఆశాలను హైదరాబాద్‌ నడిబొడ్డుపై కోఠిలో ఖాకీలతో కర్కశంగా అణచివేశారు. పోలీసుల తోపులాటలో స్పృహ తప్పిపోయిన మహిళా కార్మికులకు వైద్య చికిత్స కూడా అందించలేదు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికై ఇటీవల చేపట్టిన అనేక ఆందోళనా కార్యక్రమాలపై నిర్భంధం విధించారు. మార్చి 24న మధ్యాహ్న భోజనం కార్మికుల ధర్నాకు అనుమతిచ్చారు. కానీ ముందు రోజు మధ్యా హ్నం నుండే జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగించారు. విద్యుత్‌ శాఖలోని ఆర్టిజన్ల పోరాటాన్ని సైతం పోలీసులు అడ్డు కుంటున్నారు, విద్యుత్‌ సౌధ వద్ద ధర్నా చేసే వేలాది మంది ఆర్టిజన్లను అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో నిర్భంధించారు, ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా ఆ జిల్లాల్లో సిఐటియు నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రమంతా అసెంబ్లీ జరిగే రోజుల్లో సిఐటియు నాయకులతో పాటు కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సైతం ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ వైస్‌ చాన్స్‌లర్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 144 సెక్షన్‌ విధించారు. రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో పోలీస్‌ యాక్ట్‌-30ని అమలు చేస్తున్నారు. ఈ అంశాలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తు న్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి భిన్నంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తానని చెప్పిన కాంగ్రెస్‌ ఆచరణలో గత ప్రభుత్వంలాగే కార్మిక పోరా టాలు- ఆందోళనలపై నిర్భంధం, ఆంక్షలు విధించడం దుర్మార్గం.
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడిచింది. వారి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఈ కాలంలో వివిధ రంగాల కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు ఇచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులకు దండాలు పెట్టారు. అయినా కరుణించలేదు. వారి సమస్యల పరిష్కారం కోసం పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం చేపట్టారు. ఆ ఆందోళనలను పరిశీలించి వారి డిమాండ్లను పరిష్కరిం చాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు పౌరులుగా కార్మికవర్గానికి ఉంది. ప్రజాస్వామ్య హక్కులను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. ఈ విషయాల్లో బాధ్యతాయుతంగా ప్రభుత్వం వ్యవహరించాలి. భవిష్యత్‌లో ప్రజాతంత్ర హక్కులను పరిరక్షించాలి. పాలకవర్గాలు రాష్ట్రంలో కార్మికవర్గ పోరాటాల పట్ల వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలి. ప్రస్తుతం కొన సాగుతున్న నిర్భంధాన్ని, ఆంక్షలను ఎత్తివేయాలి. ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలి. ప్రతి ఘటనోద్యమాల ద్వారానే ప్రభుత్వ నిర్భంధాన్ని ఎదిరించగలం. అప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగలం.
– పాలడుగు భాస్కర్‌
9490098033

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img