అధిక కమీషన్ల కక్కుర్తిపై ఆగ్రహం
తప్పుకునే యోచనలో 33 శాతం హోటళ్లు
ఎన్సీఏఈఆర్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ యాప్స్పై రెస్టారెంట్లు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నాయి. డెలివరీ యాప్స్ విధిస్తున్న అధిక కమీషన్లు, ఛార్జీలపై ప్రతీ మూడింట ఒక వంతు హోటళ్ల యాజమానులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. భారత్లోని 35 శాతం రెస్టారెంట్లు ఫుడ్ డెలివరీ యాప్ల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాయని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్ ) నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. 2019లో ఒక ఆర్డర్పై సగటు కమిషన్ 9.6 శాతంగా ఉండగా, 2023 నాటికి అది 24.6 శాతానికి పెరిగింది. అంటే బిల్లులో దాదాపు నాలుగో వంతు యాప్లకే వెళ్తోందని స్పష్టమవుతోంది. ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నప్పటికీ, కమిషన్లు, ఇతర ఛార్జీల వల్ల రెస్టారెంట్లకు మిగిలే నికర లాభంయ చాలా తక్కువగా ఉంటోంది. పెద్ద రెస్టారెంట్లు ప్లాట్ఫారమ్లతో కమిషన్ల విషయంలో బేరమాడగలుగుతున్నాయి. మరోవైపు చిన్న హోటళ్లు లేదా రెస్టారెంటకు ఆ అవకాశం ఉండటం లేదు. అదే విధంగా ప్లాట్ఫారమ్ల నుండి సరైన కస్టమర్ సర్వీస్ లేకపోవడం కూడా ఒక కారణం. జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్ తదితర సంస్థలు ఫుడ్ డెలివరీకి భారీగా కమీషన్లు వసూలు చేయడం ప్రధాన ఆందోళనగా ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగితా 65 శాతం రెస్టారెంట్లు మాత్రం ఫుడ్ యాప్స్తో కొనసాగాలని భావిస్తున్నాయి. యాప్లో ఉండటం వల్ల దూర ప్రాంతాల్లోని కస్టమర్లకు కూడా రెస్టారెంట్ గురించి తెలుస్తుందని అవి యోచిస్తోన్నాయి. సొంతంగా మార్కెటింగ్ చేసుకోలేని రెస్టారెంట్లకు కూడా కొత్త కస్టమర్లు లభిస్తున్నారు. రెస్టారెంట్లు సొంతంగా డెలివరీ బార్సును పెట్టుకోవాల్సిన పని లేకుండా, యాప్స్ ఆ బాధ్యతను చూసుకుంటున్నాయి. సాధారణ సమయాల్లోనే కాకుండా, రాత్రి వేళల్లో లేదా రద్దీ లేని సమయాల్లో కూడా ఆర్డర్లు పొందే అవకాశం ఉంది. ఫుడ్ యాప్స్ అధిక కమీషన్ల వసూలును నియంత్రించగలిగితే చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు మరింత పటిష్టంగా, లాభదాయకంగా కొనసాగడానికి అవకాశాలు దక్కుతాయని ఆ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఫుడ్ డెలివరీ యాప్స్పై రెస్టారెంట్ల అసంతృప్తి
- Advertisement -
- Advertisement -



