నవతెలంగాణ-హైదరాబాద్: విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం ఆమోదించాలనే డిమాండ్తో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో నేడు జంతర్మంతర్ దగ్గర చేపట్టనున్న ధర్నాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని బీసీ నేతలు, బీసీ సంఘాల నాయకులంతా ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు జంతర్మంతర్వద్ద సుమారు 2వేల మంది ప్రతినిధులతో తెలంగాణ సర్కారు చేపట్టనున్న ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని కీలక నాయకులు హాజరై తమ సంఘీభావం తెలుపనున్నారు.
జంతర్ మంతర్ వద్ద ధర్నాకు రాష్ట్రం నుంచి ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, బీసీ నాయకులు సుమారు 2 వేల మంది వరకు తరలివెళ్లారు. సోమవారం చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో సుమారు 1,500 మంది తరలివెళ్లగా.. వీరిలో కాంగ్రెస్ నేతలతో పాటు బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జేఏసీ, మహత్మా జ్యోతి బా పూలే కమిటీ, బీసీ రాజ్యాధికార సమితి, అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం నాయకులు, టీఎన్జీవో, టీజీవో, పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు చెందిన ముఖ్యనేతలు ఉన్నారు.
మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. మూడు రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం కాంగ్రెస్ఎంపీలు బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించి.. తెలంగాణ అసెంబ్లీ పంపిన బీసీ బిల్లులను ఆమోదించాలని డిమాండ్చేశారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద చేపట్టే ధర్నాలో సంఘీభావంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ , ఇండియా కూటమి ఎంపీలు, ఆయా పార్టీల ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను మార్చి17న ఉభయసభలు ఆమోదించాయి. ఈ రెండు బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటిని పార్లమెంట్లో ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తికి కేంద్రం నుంచి స్పందన రావడం లేదు. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నది. దీంతో బిల్లుల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర సర్కార్ అమీతుమీకి సిద్ధమైంది. అందులో భాగంగానే మంగళవారం నుంచి మూడురోజుల ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం చేపట్టింది.