నవతెలంగాణ – హైదరాబాద్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతలు నేరుగా భారత బియ్యం ఎగుమతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దాదాపు లక్ష టన్నుల బాస్మతీ బియ్యం మన దేశంలోని కాండ్లా, ముంద్రా వంటి ప్రధాన నౌకాశ్రయాల్లో నిలిచిపోయింది. ఈ బియ్యం ఇరాన్కు ఎగుమతి కావాల్సినది.
ఇరాన్ భారత బాస్మతీ బియ్యం దిగుమతుల్లో రెండో అతిపెద్ద దేశం. దేశం నుంచి ఎగుమతయ్యే మొత్తం బాస్మతీ బియ్యంలో దాదాపు 18-20 శాతం ఇరాన్కు వెళ్తుంది. ఇప్పుడు ఆ సరకు సముద్ర మార్గంలో ముందుకు సాగలేకపోవడం వల్ల, భారీగా నిలిచిపోయిన నిల్వలు నౌకాశ్రయాల్లో మిగిలిపోయాయి. సాధారణంగా విదేశాలకు పంపే సరకులపై బీమా తీసుకోవడం పరిపాటి. కానీ యుద్ధం, ఉగ్రవాదం వంటి పరిస్థితుల్లో జరిగిన నష్టానికి సాధారణ బీమా కవరేజ్ వర్తించదు.
ఈ నేపథ్యంలో, ఎగుమతిదారులు తమ సరుకును రవాణా చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. గుజరాత్లోని ముంద్రా, కాండ్లా పోర్టుల్లో ఇప్పటికే లక్ష టన్నుల బాస్మతీ నిలిపివేయబడటానికి కారణం ఇదే. బియ్యం దిగుమతికి చెల్లింపులు ఆలస్యం కావడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి అంశాలు కూడా ఈ సంక్షోభాన్ని మరింత పెంచుతున్నాయి.
ఇరాన్కి వెళ్లాల్సిన బియ్యం నిలిచిపోయిన నేపథ్యంలో దేశీయంగా బాస్మతీ బియ్యం ధరలు తగ్గుతున్నాయని గోయల్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో బాస్మతీ ధర కిలోకు రూ.4 నుండి రూ.5 వరకూ పడిపోయినట్లు తెలుస్తోంది. దీని వలన రైతులు, మిల్లర్లు, ట్రేడర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే, ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గోయల్ తెలిపారు.