నవతెలంగాణ – హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో ‘వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు-2025’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లోక్సభలో రూల్ 72(1) కింద ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రియాంక తెలిపారు. “గత 20 ఏళ్లుగా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన చట్టాన్ని బలహీనపరిచే కొత్త బిల్లును మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం” అని ఆమె స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం.. డిమాండ్ ఆధారిత నిధుల కేటాయింపు విధానాన్ని రద్దు చేసి, కేంద్రమే ముందుగా నిధులు నిర్ణయించేలా మార్పులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనివల్ల గ్రామ సభల పాత్ర కూడా బలహీనపడుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
చాలా రాష్ట్రాలకు కేంద్రం వాటాను 60 శాతానికి తగ్గించడం వల్ల.. ఇప్పటికే జీఎస్టీ బకాయిల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రాలపై మరింత భారం పడుతుందని ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ట్రెజరీ బెంచీల నుంచి ‘కుటుంబం’ గురించి ఒకరు వ్యాఖ్యానించగా.. “మహాత్మా గాంధీ నా కుటుంబ సభ్యుడు కాదు, కానీ నా కుటుంబ సభ్యుడి లాంటి వారు. దేశం మొత్తం అలాగే భావిస్తుంది” అని ఆమె గట్టిగా బదులిచ్చారు.



