నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అదే విధంగా ఓటర్లను ఆకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు బీహార్ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమి సర్కార్ పలు పథకాలను ప్రకటించింది. తాజాగా బీహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ సీనియర్ నేత తేజిస్వీ యాదవ్ కూడా ఆ రాష్ట్ర మహిళల కోసం కీలక స్కీంను వెల్లడించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే బీహార్ వ్యాప్తంగా ‘మై బహిన్ మాన్ యోజన(Mai Bahin Maan Yojana) అమలు చేస్తామని చెప్పారు. స్కీంలో భాగంగా ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల మహిళలకు నెలవారీగా రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
ఇవాళ పాట్నాలో జరిగిన “అతి పిచ్దా న్యాయ్ సంకల్ప్” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం తన పార్టీ ప్రకటించిన విధానాలను అవలంబించవచ్చని హెచ్చరించారు. “ఈ ప్రభుత్వం ‘నకల్చి’ (కాపీకాట్) ప్రభుత్వం. వారికి దార్శనికత లేదు. ఇప్పుడు, మనం ఈరోజు ప్రకటించిన దానిని వారు కాపీ చేసే అవకాశం ఉంది.. ప్రజలు ‘దో హజర్ పాంచ్ సే పచ్చీస్, బహుర్ హుయే నితీష్’ అని అంటున్నారు. నితీష్ కుమార్ను హైజాక్ చేశారు, ప్రస్తుతం ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు, ఆయన ట్రాన్స్లో ఉన్నారు. బీహార్ ప్రభుత్వాన్ని ఇద్దరు వ్యక్తులు నడుపుతున్నారు: అమిత్ షా- నరేంద్ర మోడీ” అని యాదవ్ అన్నారు. అంతేకాకుండా బీహార్ వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారని ఆయన దీమా వ్యక్తం చేశారు.