నవతెలంగాణ-హైదరాబాద్ : లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతిచెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నాదర్గుల్కు చెందిన తర్రె చైతన్య (23), ఉప్పల్కు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు.
నాదర్గుల్కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మల చిన్నకుమారుడు చైతన్య. బీటెక్ పూర్తిచేసిన ఆయన.. ఉన్నత చదువుల కోసం 8 నెలల క్రితం లండన్ వెళ్లాడు. వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని 8 మంది స్నేహితులతో రెండు కార్లలో నిమజ్జనానికి బయల్దేరారు. తిరిగి వస్తున్న సమయంలో వీరి కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చైతన్య, రిషితేజ మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం రాత్రి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వీరి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.