నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నలుగురు మహిళలు మృతిచెందారు. దేవాడ-సోండో సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జాకీర్ కుటుంబం వైద్యం కోసం నాగ్పుర్లోని ఆస్పత్రికి వెళ్లారు. వారితో పాటు బంధువులు కూడా ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణంలో వీరు వస్తున్న కారు అదుపుతప్పి వంతెన పైనుంచి పడింది. దీంతో జాకీర్ భార్య సల్మా బేగం, కుమార్తె శబ్రీమ్తో పాటు బంధువులు ఆఫ్జా బేగం, సహారా మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చంద్రపూర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



