నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో శనివారం ఉదయం నొయిడా ఎక్స్ప్రెస్వేపై 12కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు, ట్రక్కులు ధ్వంసం కాగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్వేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒక కారు ముందు భాగం నుజ్జునుజ్జై డివైడర్పైకి ఎక్కగా, మరో కారు ట్రక్కు కింద ఇరుక్కుపోయి కనిపించింది. ఈ ఘటన హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్లే 135 కిలోమీటర్ల పొడవైన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వే (కుండ్లి-ఘజియాబాద్-పాల్వాల్ ఎక్స్ప్రెస్వే)పై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై గౌతమ్ బుద్ధ నగర్ (నొయిడా) పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించింది. పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపింది.



