నవతెలంగాణ – హైదరాబాద్: భారత వన్డే క్రికెట్ జట్టులో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన జట్టులో కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి, యువ ఆటగాడు శుభ్మన్ గిల్కు బీసీసీఐ పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, రోహిత్ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం తనను షాక్కు గురిచేసిందని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు.
ఇటీవలే భారత్కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన రోహిత్ శర్మను కేవలం ఆటగాడిగా ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచిందని హర్భజన్ అన్నారు. “శుభ్మన్ గిల్కు నా అభినందనలు. టెస్టుల్లో జట్టును బాగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు వన్డే బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ, రోహిత్ను కెప్టెన్గా ఎంపిక చేసి ఉంటే బాగుండేది. 2027 ప్రపంచకప్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో ఆరు, ఎనిమిది నెలలు ఆగాల్సింది” అని హర్భజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
రోహిత్ శర్మ కెప్టెన్ కాకపోయినా జట్టులో అతని పాత్ర మారదని హర్భజన్ స్పష్టం చేశారు. “వన్డేల్లో రోహిత్ యావరేజ్ 50కి దగ్గరగా ఉంది. అతను ఎప్పటిలాగే తన దూకుడైన ఆటతీరును కొనసాగిస్తాడు. జట్టులో సీనియర్ గా ఉంటూ గిల్కు అవసరమైన సలహాలు ఇస్తాడు” అని భజ్జీ పేర్కొన్నాడు.
శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా నియమించడంపై హర్భజన్ హర్షం వ్యక్తం చేశాడు. అతను ఒక ఇంపాక్ట్ ప్లేయర్ అని, అతనికి దక్కాల్సిన గుర్తింపు దక్కుతోందని అన్నాడు. గిల్, అయ్యర్ కలిసి జట్టును ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.