Wednesday, June 25, 2025
E-PAPER
Homeఆటలుఒలింపిక్స్‌లో పసిడికి రూ.6 కోట్లు

ఒలింపిక్స్‌లో పసిడికి రూ.6 కోట్లు

- Advertisement -

– తెలంగాణ నూతన క్రీడా విధానానికి కేబినెట్‌ ఆమోదం
– పారాలింపిక్స్‌ మెడలిస్ట్‌లకు సమాన ప్రైజ్‌మనీ
– సీఎం కప్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌

పదేండ్లుగా తెలంగాణ క్రీడా రంగానికి పట్టిన గ్రహణం వీడింది!. క్రీడాకారులు, క్రీడాభిమానులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కొత్త క్రీడా విధానానికి రాష్ట్ర మంత్రివర్గం సోమవారమే ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పసిడి పతకాలు సాధించిన క్రీడాకారులు ఇక నుంచి రూ.6 కోట్ల భారీ నగదు బహుమతి అందుకోనున్నారు. సీఎం కప్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలను సైతం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణ స్పోర్ట్స్‌ పాలసీలో పొందుపరిచిన కీలక అంశాలు ఇవిగో..
భారీ నగదు ప్రోత్సాహకాలు
తెలంగాణ ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎక్కడా లేని విధంగా ఒలింపిక్స్‌ పతక విజేతలతో సమానంగా పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథెట్లను గౌరవించనుంది. నగదు బహుమతుల్లో తెలంగాణ ప్రభుత్వం సమానత్వం పాటించటం గొప్ప పరిణామం. ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పసిడి పతకం సాధిస్తే రూ. 6 కోట్లు.. రజత పతకం సాధిస్తే రూ.4 కోట్లు, కాంస్య పతకం సాధిస్తే రూ.2.5 కోట్లు ప్రైజ్‌మనీ అందిస్తారు. కామన్‌వెల్త్‌/ పారా కామన్‌వెల్త్‌ క్రీడల్లో పసిడి, రజతం, కాంస్యానికి వరుసగా రూ.1.5 కోట్లు, రూ.75 లక్షలు, రూ.50 లక్షలు నగదు బహుమతి దక్కనుంది. యూత్‌ ఒలింపిక్స్‌లో పసిడికి రూ. 1 కోటి, సిల్వర్‌కు రూ.65 లక్షలు, బ్రాంజ్‌కు రూ.40 లక్షలు ఇస్తారు. ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌, యూత్‌ ఒలింపిక్స్‌లో పోటీపడిన రాష్ట్ర క్రీడాకారులకు వరుసగా రూ.15 లక్షలు, రూ.7.5 లక్షలు, రూ.2.5 లక్షలు నజరానాగా అందిస్తారు. ఆసియా/పారా ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన అథ్లెట్లకు రూ.3 కోట్లు, సిల్వర్‌కు రూ.1.5 కోట్లు, కాంస్యానికి రూ.75 లక్షలు నగదు బహమతి అందజేస్తారు. ప్రపంచకప్‌/ప్రపంచ చాంపియన్‌షిప్‌/ ప్రపంచ పారా గేమ్స్‌లో పసిడి, సిల్వర్‌, కాంస్య విజేతలకు వరుసగా రూ.1.5 కోట్లు, రూ.75 లక్షలు, రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీ అందిస్తారు. ఈ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లకు రూ.10 లక్షలు దక్కుతాయి. జాతీయ క్రీడలు, ఖేలో ఇండియా, దక్షిణాసియా క్రీడలు, ప్రపంచ విశ్వవిద్యాలయ గేమ్స్‌, బ్లైండ్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ పతక విజేతలకు సైతం కొత్త క్రీడా విధానంలో నగదు బహుమతులు ఖరారు చేశారు.
స్పోర్ట్స్‌ పాలసీలో ఖరారు చేసిన నగదు బహుమతుల కంటే అదనంగా ప్రైజ్‌మనీ సహా ఇండ్ల స్థలాలు, అకాడమీల ఏర్పాటుకు స్థలాలు ఇవ్వాలంటే అప్రూవల్‌ కమిటీ అన్ని అర్హతలను పరిశీలించి సిఫారసు చేస్తుంది. అప్రూవల్‌ కమిటీకి రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. శాట్జ్‌ చైర్మెన్‌, వీసీ ఎండీ, ఆర్థిక శాఖ ప్రతినిధి, క్రీడాశాఖ కార్యదర్శి, క్రీడా సంఘాల ప్రతినిధులు, ఒలింపిక్‌ సంఘం ప్రతినిధి, మేటి క్రీడాకారులతో కూడిన 12 మంది అప్రూవల్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అప్రూవల్‌ కమిటీ కంటే ముందుగా అథ్లెట్ల అర్జీలను స్క్రూట్నీ కమిటీ వడపోస్తుంది. ఈ కమిటీకి శాట్జ్‌ వీసీ, ఎండీ చైర్మెన్‌గా ఉంటారు. క్రీడాకారుల దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలించి.. అప్రూవల్‌ కమిటీకి పంపిస్తుంది.
ప్రతి ఏడాది అవార్డులు!
తెలంగాణ ప్రభుత్వం కొత్త వార్షిక క్రీడా అవార్డులను ప్రదానం చేయనుంది. ఈ మేరకు కొత్త క్రీడా పాలసీలో అవార్డుల కార్యక్రమం పొందుపరిచారు. ప్రతి ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర క్రీడాకారులకు, కోచ్‌లు సహా ఉత్తమ క్రీడా పాత్రికేయుడికి సైతం పురస్కారం అందిస్తారు. స్పోర్ట్స్‌ పాలసీలో ఎనిమిది అవార్డు విభాగాలు పేర్కొన్నా.. మరిన్ని చేర్చే అవకాశం లేకపోలేదు. కొత్తగా రాష్ట్ర క్రీడా దినోత్సవం నిర్వహించి.. ఆ రోజు అథ్లెట్లకు నగదు బహుమతులు, వార్షిక అవార్డులు ప్రదానం చేస్తారు.
ఐదంచెల్లో సీఎం కప్‌ పోటీలు
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ పోటీలను ఇక నుంచి ఐదంచెల్లో జరుగుతాయి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో అన్ని క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయి. ప్రతి ఏడాది సీఎం కప్‌ జాతీయ స్థాయి అంచెలో ఎంపిక చేసిన క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. ప్రతి రెండేండ్లకు ఓసారి సీఎం కప్‌ అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఎంపిక చేసిన ఏదేని క్రీడాంశాల్లో అంతర్జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయి. దీనికి తోడు ఏడాది పొడవునా రాష్ట్ర క్రీడా సంఘాలు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది. ఈ మేరకు స్పోర్ట్స్‌ పాలసీలో మార్గదర్శకాలు పొందుపరిచారు.
ఎల్బీ స్టేడియంలో సంబరాలు
నూతన క్రీడా విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపటంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాభిమానులు సహా శాట్జ్‌ చైర్మెన్‌ కే. శివసేన రెడ్డి, ఉన్నతాధికారులు.. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -