నవతెలంగాణ-హైదరాబాద్: ‘రాఖీ పౌర్ణమి’ సందర్భంగా టీఎస్ఆర్టిసీ బస్సులకు గిరాకీ పెరిగింది. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి. రాఖీ పండుగ రోజు ఈ నెల 9న 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించగా.. ఈ నెల 11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి. గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయగా.. ఈ ఏడాది 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించారు. గతేడాదితో పోలిస్తే 92.95 లక్షల మంది ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ ఏడాది 2.28 కోట్ల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరిగాయి. గత ఏడాదితో పోల్చితే 53 లక్షల కిలో మీటర్లను అదనంగా సంస్థ తిప్పింది.
రాఖీ పౌర్ణమికి మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుని ఉచితంగా రాకపోకలు సాగించడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సంస్థ సామర్థ్యాన్ని అంతా ఉపయోగించుకుని రాఖీ పండుగకు రికార్డు స్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాఖీ పండుగను త్యాగం చేసి, భారీ వర్షాల్లోనూ నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని వారి సేవలను కొనియాడారు. విపరీతమైన రద్దీలోనూ మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేశారని ప్రశంసించారు. ప్రజారవాణా వ్యవస్థపై ప్రజల ఆదరాభిమానాలు ఎంతలా ఉన్నాయో చెప్పడానికి ఈ రాఖీ పండుగ రికార్డులే నిదర్శనమన్నారు. టీఎస్ఆర్టీసీకి సహకరిస్తూ.. ప్రజా రవాణా వ్యవస్తను ఆదరిస్తోన్న, ప్రోత్సహిస్తోన్న ప్రయాణికులందరికీ ఈ సందర్భంగా సజ్జనర్ కృతజ్ఞతలు తెలియజేశారు.