– ఆంక్షలు, నిషేధాలు, ఒత్తిళ్ళు వస్తున్నా కిమ్మనని మోడీ
– జీ హుజూర్ అంటూ అమెరికాకు వంతపాట – దేశ ప్రయోజనాలకు విఘాతం
– ఆర్థికంగా నష్టపోతున్న ప్రజానీకం
గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలను గమనిస్తుంటే ఓ విషయం స్పష్టమవుతోంది. ఒకటి కాదు… రెండు కాదు… ఆయన లెక్కలేనన్ని ప్రకటనలను చాలా ధైర్యంగా చేస్తున్నారు. అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను వంద శాతం తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదన్నది అందులో ఓ ప్రకటన. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, భారత్ కూడా అలాగే కోరుకుంటూ ‘జీరో’ సుంకాలకు అంగీకరించిందని ఆయన చెప్పుకొచ్చారు. భారత దేశంలో ఐఫోన్లను ఉత్పత్తి చేయవద్దని యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్కు చెప్పానంటూ ట్రంప్ తాజాగా మరో ప్రకటన చేశారు. ఇంతకీ తన డిమాండ్లకు భారత్ తలవంచుతుందన్న ధీమా ట్రంప్లో ఏర్పడడానికి కారణమేమిటి? బహుశా మన ప్రధాని నరేంద్ర మోడీ మౌనమే దానికి కారణమని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తుతోంది. ప్రయివేటు కంపెనీల అధిపతులను, ఇతర సార్వభౌమత్వ దేశాల అధినేతలను ఆదేశించే స్థాయికి ట్రంప్ ఎలా వెళుతున్నారు? అసలు ఆయనకు ఏ హక్కు ఉంది? ఇతరులను బెదిరించడం, తన దారికి తెచ్చుకోవడం ఆయన వ్యూహమా?
న్యూఢిల్లీ: ట్రంప్ పిచ్చివాడని కొందరు భావిస్తుంటారు. ప్రపంచ క్రమాన్ని దెబ్బతీసే వ్యక్తి అని మరి కొందరు అంటారు. చురుకైన సంధాన కర్త అని, కల్లాకపటం తెలియని వ్యాపారవేత్త అని ఇంకొం దరు చెబుతుంటారు. కానీ లోతుగా విశ్లేషిస్తే తన భౌగోళిక రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రయత్ని స్తున్న అగ్రరాజ్యపు ఏజెంటుగా ఆయనను చూడవచ్చు. వాణిజ్యం, సుంకాలపై ఆయన జరుపుతున్న చర్చలను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆధునిక కాలంలో ఓ సామ్రాజ్యవాద దేశం ఎలా పనిచేస్తుందో గమనించడం అవసరం. ఆంక్షలు, నిషేధాలను తన అధికార సోపానాలుగా ఉపయోగించుకోవడంలో అమెరికాకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఉదాహరణకు చైనానే తీసుకుందాం. చైనా సంస్థలకు చిప్స్ విక్రయించకుండా న్విదియా వంటి అమెరికా కంపెనీలను నిషేధించారు. కృత్రిమ మేధ (ఏఐ)లో చైనా పురోగమించకుండా అడ్డుకోవడమే ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశం. అయితే ఇలాంటి ప్రయత్నాలు ఎల్లవేళలా ఫలితాన్ని ఇవ్వవు. ఈ సంవత్సరం ప్రారంభంలో చైనా డీప్సీక్ ఏఐని ప్రారంభించింది. దీంతో న్విదియా వాటాల విలువ 17 శాతం పడిపోయింది. ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ ఇటీవల హ్యూవై కంపెనీ తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్తో కొత్త ల్యాప్టాప్ను విడుదల చేసింది.
పాలకుల వైఖరితో నష్టపోతున్న ప్రజానీకం
మరి ట్రంప్కు ”స్నేహపూర్వక దేశమైన” భారత్ సంగతేమిటి? ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మన దేశంలో పర్యటించారు. అయితే ఆ పర్యటన వివరాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. బయట నుంచి చూస్తే మాత్రం అమెరికాకు భారత్ సమాన వాణిజ్య భాగస్వామిగా కన్పించడం లేదు. కేవలం జూనియర్ భాగస్వామిగా మాత్రమే కన్పిస్తోంది. అమెరికా చెప్పే ప్రతి మాటకూ ఎస్ సార్, జీ హుజూర్ అనడం మినహా భారత్ నుంచి మరో స్పందన కన్పించడం లేదు. ఈ వైఖరి మన ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. అమెరికా పౌరులు కాని వారు జరిపే ప్రతి అంతర్జాతీయ చెల్లింపుపై ఐదు శాతం పన్ను విధించాలని కొత్త రిపబ్లికన్ ఆర్థిక బిల్లు ప్రతిపాదించింది. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరం లోనే అమెరికాలో నివసిస్తున్న భార తీయులు స్వదేశానికి 32 బిలియన్ డాలర్లు పంపారు. దీనిని బట్టి చూస్తే భారతీయుల నుంచి ఏటా అమెరికాకు 1.6 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అర్థమవుతోంది. భారతీయ విద్యార్థులు రుణాలు తీసుకొని అమెరికాలో చదువు తుంటారు. కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తారు. స్వదేశంలోని కుటుంబ సభ్యులకు ఆ డబ్బు పంపు తుంటారు. ఇప్పుడు దాని పైన కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు… అమెరికా వెలుపల నిర్మించే చిత్రాలపై కూడా వంద శాతం పన్ను విధించాలని ట్రంప్ భావిస్తున్నారు. భారతీయ చిత్రాలు అమెరికా థియేటర్లలో ప్రదర్శిం చకుండా అడ్డుకోవడా నికి ఈ పన్ను దోహదపడవచ్చు. పన్ను విధిస్తే మన చిత్రాలను అమెరికాలో విడుదల చేయడం దాదాపుగా అసంభ వమే. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పం దంపై చర్చలు జరుగుతున్నాయి. సెప్టెంబర్- నవంబర్ మధ్యలో ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒకటే…జూనియర్ భాగస్వామికి ట్రంప్ ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు?
ప్రపంచ వాణిజ్య వ్యవస్థ తీరే అంత
అమెరికా ఓ వైపు స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలను ప్రవచిస్తూనే మరోవైపు వాటిని ఎంత మాత్రం పాటించడం లేదు. చాలా అరుదుగా మాత్రమే ఇతర దేశాలను సమాన వ్యాపార భాగస్వామిగా చూస్తుంటుంది. వాస్తవానికి వర్ధమాన దేశాలకు, పారిశ్రామికంగా అంతగా అభివృద్ధి చెందని దేశాలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య వ్యవస్థ సంవత్సరాల తరబడి పనిచేస్తూనే ఉంది. ఆయా దేశాలు ఎన్నో ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ వాటికి ఉన్న సహజ వనరుల కారణంగా అ దేశాలు ఓ క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందుతున్నాయి.
అరబ్ దేశాలపై అమిత ప్రేమ
ట్రంప్ పాలనలో అమెరికా విదేశాంగ విధానంలో మార్పు కన్పిస్తోంది. మొన్నటి వరకూ అరబ్ దేశాల విషయంలో అమెరికా ఉదారంగా వ్యవహరించలేదు. కానీ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఖరి మారింది. తొలి విదేశీ పర్యటన కోసం ఆయన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలను ఎంచుకున్నారు. ట్రంప్తో పాటు 30 అగ్రశ్రేణి అమెరికా ప్రయివేటు కంపెనీల ప్రతినిధులు కూడా ఆయా దేశాలలో పర్యటించారు. ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. అందుకు ట్రంప్కు కృతజ్ఞతలు సైతం చెప్పుకున్నారు. ఖతార్ ప్రభుత్వమైతే ట్రంప్కు విలాసవంతమైన బోయింగ్ 747 విమానాన్ని ఆఫర్ చేసింది.
ఒప్పందం కోసం ఒత్తిడి
టంప్ సన్నిహితుడైన ఎలన్ మస్క్ యాజమాన్యంలోని స్టార్లింక్ ప్రాజెక్ట్ ఇప్పుడు మన దేశంలో కార్యకలాపాలను ప్రారంభించ బోతోంది. ఆ కంపెనీ ఇప్పటికే టెలికం శాఖ నుంచి లైసెన్స్ కూడా పొందిందని తెలుస్తోంది. ఇది కేవలం ఒక్క భారత్కే పరిమితం కాలేదు. స్టార్లింక్తో ఒప్పందాలు చేసుకోవాలంటూ ట్రంప్
సుంకాలను ఎదుర్కొంటున్న ప్రతి దేశంపై ఒత్తిడి పెరుగుతోంది.
శ్రమశక్తి, వనరులను దోచుకుంటూ…
ఉదాహరణకు చమురునే తీసుకుందాం. ప్రపంచంలో అతి పెద్ద చమురు నిల్వలు (303 బిలియన్ బ్యారల్స్) ఉన్న దేశం వెనిజులా. సౌదీ అరేబియా, ఇరాన్, కెనడా, ఇరాక్ దేశాలు ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. కేవలం 55 బిలియన్ బ్యారల్స్ నిల్వలు మాత్రమే ఉన్న అమెరికా తొమ్మిదో స్థానంలో ఉంది. అయినప్పటికీ వాస్తవ చమురు ఉత్పత్తి, శుద్ధి విషయానికి వచ్చేసరికి అమెరికా మొదటి స్థానంలో ఉండగా వెనిజులా ఎక్కడా కన్పించడం లేదు. చమురు వినియోగంలో కూడా అదే పరిస్థితి. అమెరికాదే అగ్రస్థానం. సహజ వాయువుల నిల్వల విషయంలోనూ ఇదే కథ నడుస్తోంది. వలస పాలన సమయంలో బ్రిటన్ వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. భారత్లో రైతులు ఎంతో కష్టపడి పత్తిని పండిస్తే అది బ్రిటన్ పరిశ్రమకు ఎంతగానో ఉపయోగపడింది. నిరుపేద దేశాలలో చౌకగా లభించిన కార్మికులు, వనరులు పశ్చిమ దేశాలను సౌభాగ్యవంతం చేశాయి. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. వనరులేమో వర్ధమాన దేశాలవి. అభివృద్ధి జరిగేది మాత్రం అక్కడే. చౌకగా లభించే శ్రమశక్తితో పశ్చిమ దేశాల ప్రజలు విలాసవంతంగా జీవిస్తారు. ఇది అసహజం, అన్యాయం, సుంకాలతో, బలవంతపు ఒప్పందాలతో అమెరికాను కాపాడడానికి ట్రంప్ చేస్తున్న పోరాటం కూడా ఇలాంటిదే.