ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై లి.బ్యానర్ పై రాధిక లావూ నిర్మాణంలో ఐ.వి.శశి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. వసంత్ మరింగంటి రచించిన ఈ చిత్రంలో సుహాస్, కీర్తి సురేష్ ప్రధానపాత్రలు పోషించగా, బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలలో జూలై 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హింది, తమిళం, మళయాళం, కన్నడ, ఇంగ్లీష్తో కలిపి 12 భాషలలో సబ్టైటిల్స్తో ఇది ప్రసారం కానుంది. 1990లో చిట్టి జయపురం అనే పల్లెటూరి ఒక చిత్రమైన సమస్యని ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ ఊరిలో మరణించినవారిని పూడ్చిపెట్టటానికి చోటు లేదు. కొత్తగా నియమించబడిన, ఆదర్శవంతురాలైన గ్రామాధికారి, అపూర్వ (కీర్తి సురేష్), ఆ ఊరి కాటికాపరి చిన్న (సుహాస్) ఈ సమస్యను పరిష్కరించడానికి ఏం చేశారనేది ఆద్యంతం హాస్యభరితంగా సాగునుంది. కీర్తి సురేష్ మాట్లాడుతూ, ‘ఇందులో అపూర్వ అనే భిన్నమైన పాత్ర చేశాను. ఆమె ఆదర్శవాది, దఢనిశ్చయం కలిగినది. ఈ సినిమాలో ఉన్న సమస్య నన్ను బాగా కదిలించింది’ అని తెలిపారు. ‘చిన్నా పాత్ర ఇదివరకు నేను చేసిన పాత్రల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇతను ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కుంటాడు. ఆ పరిస్థితి ఏంటి? అనేది ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సినిమా నీతులు చెప్పేదిగా ఉండదు’ అని సుహాస్ అన్నారు.