– డీహెచ్కు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
– కోవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీ, సీడీఎఫ్డీలకు నమూనాలు పంపించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో దేశంలో కోవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై ఆయన సంబంధిత నిపుణులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిళ్లను పంపించాలని సీసీఎంబీ, సీడీఎఫ్డీ డైరెక్టర్లు మంత్రికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు సీసీఎంబీ, సీడీఎఫ్డీ, బీబీనగర్ ఎయిమ్స్, నిమ్స్ తదితర సంస్థలతో కలిసి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ), ఇన్ఫ్లుయేంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ) సర్వైలెన్స్ చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, ఇతర డిపార్ట్మెంట్ల తో సమన్వయం చేసుకుంటూ, ప్రతి గ్రామంలో, పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాలను విరివి గా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవు తున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేయాలనీ, ఆరోగ్యశాఖ నుంచి స్పెషల్ టీమ్లను పంపించి అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయనీ, సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మందులు, డయాగస్టిక్ ఎక్విప్మెంట్, మెడికల్ రీఏజెంట్స్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. శానిటేషన్, డైట్ నిర్వహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయివేటు ఆస్పత్రులపై నిఘా పెంచాలనీ, డెంగీ, ప్లేట్లెట్ల పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో వాటర్బోర్న్(డయేరియా, టైఫాయిడ్…), వెక్టార్ బోర్న్ (డెంగీ, మలేరియా..) జబ్బుల నివారణ, నియంత్రణకు సూచనలు ఇవ్వాలని నిపుణులను మంత్రి కోరారు. వెక్టార్బోర్న్ డిసీజ్ల నియంత్రణ కోసం, ఎప్పటికప్పుడు నీటి శాంపిళ్లను పరీక్షించి, నివేదికలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి విజ్ఞప్తికి సీసీఎంబీ, సీడీఎఫ్డీ డైరెక్టర్లు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి నమూనాలను సేకరించి, సీసీఎంబీ, సీడీఎఫ్డీ తదితర ల్యాబ్లకు పంపించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. వర్షాలు మొదలైనందున వానాకాలం పంటలను రైతులు ప్రారంభిస్తారని, ఈ క్రమంలో పాము, తేలు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని మంత్రి గుర్తు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రుల్లో పాము, తేలు కాటు బాధితులకు ట్రీట్మెంట్ కోసం అవసరమైన మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కోవిడ్, ఇతర ఆరోగ్య సంబంధిత సమాచారం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీసీఎంబీ, ఐసీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. కోవిడ్ గురించి ఆందోళన అవసరం లేదని, సీసీఎంబీ, ఐసీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయం చెబుతున్నారని మంత్రి గుర్తు చేశారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరం, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికైతే ప్రమాదం లేదు :నిపుణులు
సీసీఎంబీ డైరెక్టర్ వినరు నంబికూరి సహా ఇతర నిపుణులంతా ఇండియా, ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులను మంత్రికి వివరించారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం, పరిశోధనల ప్రకారం కోవిడ్తో ఇప్పటికైతే ప్రమాదమేమీ లేదన్నారు. వివిధ దేశాల్లో అక్కడక్కడా కేసులు పెరుగుతున్నా, హాస్పిటలైజేషన్ అసలు లేదని తెలిపారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. సాధారణ ప్రజలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడు కనిపించడం లేదని మంత్రికి వివరించారు. కోవిడ్పై తమ పరిశోధనలు నిరంతరం కొనసాగుతు న్నాయనీ, వివిధ దేశాల్లో అప్పుడప్పుడు సైలెంట్గా కేసులు పెరుగుతున్నాయనీ, క్రమంగా తగ్గిపోతున్నాయని వెల్లడించారు. కోవిడ్ వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు. మన రాష్ట్రంలో, దేశంలో ప్రజల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినందున పెద్దగా, కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు వివరించారు. పరిస్థితి సాధారణంగా ఉండడం వల్ల, కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఇప్పటి వరకూ ఎటువంటి సలహాలు, మార్గదర్శకాలు విడుదల చేయలేదని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అభిషేక్ అరోరా చెప్పారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, సెంటర్ ఫర్ డీఎన్ఏ, ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగస్టిక్స్ డైరెక్టర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారామ్ , ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ శాస్త్రవేత్త, డాక్టర్ సుదీప్ ఘోష్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజరుకుమార్ పాల్గొన్నారు.
కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీ, సీడీఎఫ్డీకి నమూనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES