Saturday, June 7, 2025
E-PAPER
Homeఆటలుక్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

- Advertisement -

– పి.వి సింధు పరాజయం
-ఇండోనేషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
జకర్తా (ఇండోనేషియా)

భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోరు కొనసాగుతుంది. ఇటీవల సింగపూర్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుని ఫామ్‌లోకి వచ్చిన సాత్విక్‌, చిరాగ్‌లు జకర్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నమెంట్‌లో అదే జోరు చూపిస్తున్నారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్‌, చిరాగ్‌లు మూడు గేముల పాటు సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 16-21, 21-18, 22-20తో మెరుపు విజయం నమోదు చేశారు. వరల్డ్‌ నం.16 డెన్మార్క్‌ షట్లర్లపై సాత్విక్‌, చిరాగ్‌లు విజయం కోసం గంటకుపైగా చెమటోడ్చారు. తొలి గేమ్‌లో 10-11తో వెనుకంజ వేసిన సాత్విక్‌, చిరాగ్‌ ద్వితీయార్థంలో ఆశించిన ప్రదర్శన చేయలేదు. 21-16తో డెన్మార్క్‌ జోడీ రాస్మస్‌, ఫ్రెడరిక్‌లు ముందంజ వేశారు. కీలక రెండో గేమ్‌లో సాత్విక్‌, చిరాగ్‌ గొప్పగా పుంజుకున్నారు. 14-14 వరకు గట్టి పోటీనిచ్చిన డెన్మార్క్‌ జోడీని వెనక్కి నెట్టి వరుస పాయింట్లు సాధించారు. 21-18తో రెండో గేమ్‌ గెలుపొంది లెక్క సమం చేశారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ నువ్వా నేనా అన్నట్టు సాగింది. విరామ సమయానికి 10-11తో మనోళ్లు ఓ పాయింట్‌ వెనుకంజలో నిలిచినా..17-17తో స్కోరు సమం చేశారు. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన గేమ్‌లో 20-20తో టైబ్రేకర్‌కు వెళ్లింది. వరుసగా రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్న సాత్విక్‌, చిరాగ్‌ మూడో గేమ్‌తో పాటు క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకున్నారు. నేడు క్వార్టర్స్‌లో వరల్డ్‌ నం.7 మలేషియా షట్లర్లు వీ చోంగ్‌, వున్‌ టీలతో సాత్విక్‌, చిరాగ్‌లు పోటీపడనున్నారు. మలేషియా జోడీతో 4-0 తిరుగులేని ముఖాముఖి రికార్డు సాత్విక్‌, చిరాగ్‌ సొంతం.
మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌, రెండు సార్లు ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పి.వి సింధు పరాజయం పాలైంది. రెండో రౌండ్లో థారులాండ్‌ షట్లర్‌ చొచువాంగ్‌ చేతిలో మూడు గేముల మ్యాచ్‌లో నిరాశపరిచింది. 22-20, 10-21, 16-21తో సింధు ఓటమి చెందింది. తొలి గేమ్‌ను టైబ్రేకర్‌లో నెగ్గి ముందంజ వేసిన సింధు.. వరుస గేముల్లో చొచువాంగ్‌ ముందు తలొగ్గింది. సుమారు గంటన్నర పాటు సాగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన సింధు ఇండోనేషియా ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి జోడీ 13-21, 22-24తో జపాన్‌ షట్లర్ల చేతిలో పోరాడి ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో సతీశ్‌ కుమార్‌, ఆద్యలు 7-21, 12-21తో ఆరో సీడ్‌ థారులాండ్‌ అమ్మాయిలకు కనీస పోటీ ఇవ్వలేకపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -