Saturday, June 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రారంభం రోజే పాఠశాలలకు తాళాలు

ప్రారంభం రోజే పాఠశాలలకు తాళాలు

- Advertisement -

– అద్దె ఇవ్వలేదని మైనారిటీ గురుకులానికి తాళం
– హైదరాబాద్‌ కలెక్టర్‌ హామీతో తాళం తీసిన యజమాని
– బిల్లులు రాలేదని ఆకునూరు ఉన్నత పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్‌
నవతెలంగాణ – ముషీరాబాద్‌/చేర్యాల

వేసవి సెలవులు ముగిసి.. పాఠశాలలు పున:ప్రారంభమైన రోజే కొన్ని చోట్ల అనూహ్య ఘటనలు జరిగాయి. అద్దె కట్టలేదని, బిల్లులు చెల్లించలేదని యజమాని, కాంట్రాక్టర్‌ పాఠశాలలకు తాళాలు వేశారు. దాంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరుబయటే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో తాళాలు తీశారు. ఈ ఘటనలు హైదరాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో జరిగాయి. వివరాలిలా ఉన్నాయి..
హైదరాబాద్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో 371 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ భవనానికి ప్రభుత్వం నెలకు రూ.6.5 లక్షల అద్దె చెల్లిస్తోంది. అయితే, 13 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని సాహిల్‌ కొఠారి పాఠశాల గేటుకు తాళం వేశారు. గురువారం తాళం తీయడానికి వచ్చిన ప్రిన్సిపాల్‌ వాణిశ్రీకి భవన యజమాని సాహిల్‌ కొఠారి అడ్డు తగిలారు. ప్రిన్సిపాల్‌, విద్యార్థులు లోనికి వెళ్లకుండా బిల్డింగ్‌ గేటుకు తాళాలు వేశారు. 13 నెలలుగా ప్రభుత్వం గురుకుల భవనాలకు అద్దె చెల్లించడం లేదని, అద్దె చెల్లించకపోతే లోపలికి అనుమతించేది లేదని భీష్మించుకొని అక్కడే కూర్చున్నాడు. సమాచారం అందుకున్న హిమాయత్‌నగర్‌ తహసీల్దార్‌ సంధ్యారాణి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్‌, అశోక్‌ పాఠశాల ప్రాంగణం వద్దకు చేరుకొని ప్రిన్సిపాల్‌, భవన యజమానితో చర్చించారు. విద్యార్థులను రోడ్లపై ఉంచొద్దని, వెంటనే తాళాలు తెరవాల్సిందిగా కోరారు. ఎంతకూ యజమాని వినకపోవడంతో అధికారులు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దూరిశెట్టికి సమాచారం అందించారు. ఆయన వెంటనే సంబంధిత బిల్డింగ్‌ యజమానితో సంప్రదింపులు జరిపి 13 నెలల అద్దెకుగాను ఐదు నెలలు అద్దె వెంటనే చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సదరు భవన యజమాని తాళం తీశారు. విద్యార్థులను నడిరోడ్డుపై నిలబెట్టిన భవన యజమానిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.
చేర్యాలలో..
పాఠశాల అభివృద్ధి కోసం చేసిన పనులకు బిల్లులు రాలేదని ఓ కాంట్రాక్టర్‌ బడి పున:ప్రారంభం రోజే పాఠశాలకు తాళం వేశాడు. సిద్దిపేట జిల్లా జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండేండ్ల కిందట మన ఊరి-మన బడి నిధుల ద్వారా డైనింగ్‌ హాల్‌, టైల్స్‌, ఎలక్ట్రిషన్‌ వర్క్‌ను మాజీ ఎస్‌ఎంసీ చైర్మెన్‌, కాంట్రాక్టర్‌ కోతి దాసు చేపట్టారు.
ఇందుకు సంబంధించిన బిల్లులు రూ.8.50 లక్షలు రావాల్సి ఉన్నది. ఈ విషయమై అనేకసార్లు జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ బిల్లులు మంజూరు చేయలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని అతడు వాపోయాడు. ఈ క్రమంలో పాఠశాల పున:ప్రారంభం రోజు హైస్కూల్‌కు తాళం వేశాడు. చేర్యాల ఎస్‌ఐ పి.నీరేష్‌ పాఠశాలకు చేరుకొని అతనితో మాట్లాడారు. వెంటనే డీఈఓ, ఏసీపీలతో మాట్లాడించి సర్ది చెప్పడంతో కాంట్రాక్టర్‌ తాళం తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -