Sunday, June 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందోస్త్‌ రెండోవిడతలో 43,568 మందికి సీట్ల కేటాయింపు

దోస్త్‌ రెండోవిడతలో 43,568 మందికి సీట్ల కేటాయింపు

- Advertisement -

– 18 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు
– 19 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల నమోదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) రెండో విడత సీట్లను ఉన్నత విద్యామండలి కేటాయించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, దోస్త్‌ కన్వీనర్‌ వి బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దోస్త్‌ రెండో విడతకు 46,883 మంది విద్యార్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని పేర్కొన్నారు. వారిలో 43,568 మందికి సీట్లు కేటాయించామని చెప్పారు. మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో రెండో విడతలో మెరుగైన కాలేజీ, కోర్సు కోసం వెబ్‌ఆప్షన్లను చేశారనీ, 6,077 మందికి కేటాయించామని వివరించారు. సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లను నమోదు చేయకపోవడం వల్ల 3,315 మందికి సీట్లు కేటాయించలేదని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులు 30,973 మంది ఉన్నారని పేర్కొన్నారు. రెండు, ఇతర ప్రాధాన్యతల ఆధారంగా 12,595 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. కామర్స్‌లో 13,900 మంది, ఫిజికల్‌ సైన్సెస్‌లో 11,277 మంది, లైఫ్‌ సైన్సెస్‌ (జీవ శాస్త్రాలు)లో 8,821 మంది, ఆర్ట్స్‌లో 5,032 మంది, ఇతర కోర్సుల్లో 4,538 మంది కలిపి మొతం 43,568 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా సీటును రిజర్వు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఈనెల 18 వరకు ఉందని తెలిపారు. దోస్త్‌ మూడో విడత రిజిస్ట్రేషన్‌తోపాటు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌, వెబ్‌ఆప్షన్ల నమోదుకు తుది గడువు ఈనెల 19 వరకు ఉందని తెలిపారు. ఈనెల 23న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://సశీర్‌.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -