Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదోస్త్‌ మూడోవిడతలో 85,680 మందికి సీట్ల కేటాయింపు

దోస్త్‌ మూడోవిడతలో 85,680 మందికి సీట్ల కేటాయింపు

- Advertisement -

– సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు 30
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) మూడో విడత సీట్లను ఉన్నత విద్యామండలి కేటాయించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, దోస్త్‌ కన్వీనర్‌ వి బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దోస్త్‌ మూడో విడతలో 82,770 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకు న్నారని తెలిపారు. మూడో విడతలో మొత్తం 96,015 మంది విద్యార్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని పేర్కొన్నారు. వారిలో 85,680 మందికి సీట్లు కేటాయిం చామని వివరించారు. మొదటి ప్రాధాన్యతద్వారా సీట్లు పొందిన విద్యార్థులు 64,181 మంది ఉన్నారని తెలిపారు. రెండో ప్రాధాన్యత, ఇతర ప్రాధాన్యత ద్వారా సీట్లు పొందిన వారు 21,499 మంది ఉన్నారని పేర్కొన్నారు. మొదటి, రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు మూడో విడతలో మెరుగైన కాలేజీ, కోర్సు కోసం వెబ్‌ఆప్షన్లను చేశారని తెలిపారు. సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లను నమోదు చేయకపోవడం వల్ల 10,335 మందికి సీట్లు కేటాయించలేదని తెలిపారు.

కామర్స్‌లో 35,402 మందికి సీట్ల కేటాయింపు
దోస్త్‌ మూడో విడతలో కామర్స్‌లో 35,402 మందికి సీట్లు కేటాయించామని బాలకిష్టారెడ్డి, శ్రీదేవసేన పేర్కొన్నారు. ఫిజికల్‌ సైన్సెస్‌లో 20,890 మంది, లైఫ్‌ సైన్సెస్‌ (జీవ శాస్త్రాలు)లో 16,099 మంది, ఆర్ట్స్‌లో 13,128 మంది, ఇతర కోర్సుల్లో 161 మంది కలిపి మొతం 85,680 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా విద్యార్థులకు సమాచారం అందించామని తెలిపారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా సీటును రిజర్వు చేసుకోవాలని సూచించారు. దోస్త్‌ లాగిన్‌లో విద్యార్థులు రూ.500 లేదా రూ.వెయ్యి చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఈనెల 30 వరకు ఉందని తెలిపారు.
దోస్త్‌ రెండో విడతలో సీటు పొంది సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన విద్యార్థికి మూడో విడతలో సీటు వస్తే ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి సీటును రిజర్వు చేసుకోవాలని కోరారు. రెండో విడతలో వచ్చిన సీటు రద్దవుతుందని పేర్కొన్నారు. మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు వచ్చేనెల ఒకటో తేదీ వరకు రిపోర్టు చేయాలని తెలిపారు. ఒకవేళ రిపోర్టు చేయకుంటే ఆ సీటును కోల్పోతారని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -