– నెలనెలా పద్ధతికి స్వస్తి చెప్పాలి
– జులై 9 సమ్మెలో పాల్గొంటాం : వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులకు సీఐటీయూ సమ్మెనోటీస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెక్యూరిటీ గార్డుల కొనసాగింపు ఉత్తర్వులు నెలానెలా ఇవ్వడం సరిగాదనీ, ఏడాదికి ఒకేసారి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డుల రాష్ట్ర కమిటీ(సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. ఆ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్లో జరిగింది. తదనంతరం వ్యవసాయ శాఖ సంచాలకులు కె.సురేంద్ర మోహన్కు సమ్మె నోటీసు అందజేసింది. సంచాలకులు స్పందిస్తూ సంవత్సరానికి కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామనీ, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తామని హామీనిచ్చారు. వినతి పత్రం అందించిన వారిలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల సాంబయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగిడి లక్ష్మణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు బొట్ల వెంకటేష్, తదితరులున్నారు. ఈ సందర్భంగా యాటల సోమన్న మాట్లాడుతూ..రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన సుమారు 1,200 మంది సెక్కూరిటీ గార్డులు 30 ఏండ్ల నుంచి మార్కెట్ యార్డులు, చెక్పోస్టులు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గతంలో వారికి ఏడాదికోసారి కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రతి నెలా కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తున్నారనీ, దీంతో వచ్చే నెల తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అన్న అభద్రతా భావంలో సెక్యూరిటీ గార్డులున్నారని వాపోయారు. ఈ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందేనన్నారు. లేకపోతే పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో వ్యవసాయ మార్కెట్ల సెక్యూరిటీ గార్డులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సెక్యూరిటీ గార్డుల కొనసాగింపు ఉత్తర్వులు ఏడాదికోసారివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES