నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఒక మీడియా ఛానల్పై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
వివిధ వర్గాల ఫోన్లను ట్యాప్ చేయడంపై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాజకీయ నేతలే లక్ష్యమైతే, వారి కుటుంబ సభ్యులైన మహిళల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులే కాకుండా, సినీ తారలు, న్యాయమూర్తులు, మహిళా అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ చర్యల వల్ల ఎంతో మంది కుటుంబాల్లో లేనిపోని చిచ్చు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల వ్యక్తిగత సంభాషణలను దొంగచాటుగా వినాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.
ఏదైనా విషయంపై అభ్యంతరాలు ఉంటే, ప్రజాస్వామ్యంలో చట్టపరంగా పోరాడాలని, అంతేగానీ మీడియా సంస్థలపై భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని మహేశ్ కుమార్ గౌడ్ హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకత్వం ఇటువంటి దాడులను ప్రోత్సహించవద్దని, చట్టపరమైన మార్గాలను అనుసరించాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు విచారణలో తేలతాయని, బాధ్యులెవరైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని ఆయన అన్నారు.