నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ సోమవారం ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు బాధ్యతలు అప్పగించిన అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే తన లక్ష్యమని అన్నారు. ట్రంప్ తన స్నేహితుడు ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారని అన్నారు.
భారత్, అమెరికాలు వాణిజ్య ఒప్పందంపై వేగంగా చర్చలు జరుపుతున్నాయని, ప్రతినిధుల మధ్య మొదటి సమావేశం మంగళవారం కానుందని అన్నారు. అమెరికా నేతృత్వంలోని కొత్త వ్యూహాత్మక చొరవ అయిన పాక్స్ సిలికాలో పూర్తి సభ్యులుగా చేరడానికి భారత్ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
అయితే ఢిల్లీలోని వందలాది మంది అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందికి, మీడియాకు సెర్గియో గోర్ చేసిన ప్రకటన సాంప్రదాయ విరుద్ధమని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. గోర్ తన అధికారిక పత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించాల్సి వుంది. దౌత్య ప్రోటోకాల్ ప్రకారం.. పత్రాలను సమర్పించిన తర్వాతే రాయబారులు బహిరంగ ప్రకటన విడుదల చేయాల్సి వుంది. ఈ వారం చివరలో రాష్ట్రపతి సెర్గియో పత్రాలను ఆమోదించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.



