నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్లో గంభీర బ్రిడ్జ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. ఈ మేరకు వడోదర జిల్లా కలెక్టర్ శుక్రవారం అనిల్ ధమేలియా మీడియాతో మాట్లాడారు. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ కోసం.. రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. మిగిలిన మృతదేహాలు స్లాబ్ కింద చిక్కుకున్నాయని, వారిని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే చిక్కుకున్న ట్రక్కు డ్రైవర్ కూడా కనిపించడం లేదని, అతని మృతదేహాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. నది మధ్యలో, 3 నుంచి 4 మీటర్లు ఇసుక ఉందని, ఇది రెస్క్యూ బృందానికి సవాల్గా మారిందని చెప్పారు.
వడదొర సమీపంలోని మహిమాసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన (జూలై 9) బుధవారం కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు, ఓ ఆటో నదిలో పడిపోయాయి. మరోవైపు బ్రిడ్జ్పై ట్యాంకర్ ఇరుక్కుపోయింది. ఇప్పటి వరకు 18 వరకు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.