Monday, June 30, 2025
E-PAPER
Homeజాతీయంగుజరాత్‌ 'స్థానిక' ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ నేత ఘనవిజయం

గుజరాత్‌ ‘స్థానిక’ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ నేత ఘనవిజయం

- Advertisement -

– గ్రామాభివృద్ధే లక్ష్యం : వద్‌వాసా సర్పంచ్‌ సత్యేషా
సూరత్‌:
గుజరాత్‌లోని సబరకాంత జిల్లాలోని ప్రాంటిజ్‌ తాలుకాలో వద్‌వాసా గ్రామ సర్పంచ్‌గా 25 ఏండ్ల ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది సత్యేషా లెవా గెలుపొందారు. పార్టీ చిహ్నాలపై గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగనప్పటికీ తాను కమ్యూనిస్టు సిద్ధాంత భావజాలాన్ని అనుసరిస్తానని సత్యేషా చెప్పారు. గుజరాత్‌లో సీపీఐ(ఎం) ఆఫీసు బేరర్‌గా కూడా ఉన్నారు. గుజరాత్‌లోని దాదాపు 3,894 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరిగింది. ఎస్సీ మహిళకు రిజర్వ్‌ చేసిన ఈ సీటు నుంచి పోటీ చేసిన సత్యేషాకు మొత్తంగా 596 ఓట్లు లభించాయి. ఆమె ప్రత్యర్ధులు సవిత, పుష్పలకు వరుసగా 492, 236ఓట్లు లభించాయి. సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సత్యేషా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి. వృత్తిరీత్యా న్యాయవాది. అహ్మదాబాద్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అనేక ప్రజా సమస్యల పరిష్కారాలపై ఆమె దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. సీపీఐ(ఎం) సబరకాంత జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలైన ఆమె పార్టీ రాష్ట్ర కమిటీకి శాశ్వత ఆహ్వానితురాలు.
గ్రామ అభివృద్ధే లక్ష్యం : సత్యేషా
ఒక ఆంగ్ల వార్త సంస్థతో సత్యేషా మాట్లాడుతూ గ్రామ అబివృద్ధే లక్ష్యమని చెప్పారు. గ్రామంలో రోడ్లు వేయడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం చాలాకాలం నుంచి జరగలేదని, అది వెంటనే చేపట్టడమే తన తక్షణ ప్రాధాన్యత అని తెలిపారు. గ్రామంలో చెత్తను నిర్మూలించడం కూడా ముఖ్యమైన పనేనని చెప్పారు. గ్రామంలో ఇండ్లు మంజూరైనా ఇంతవరకు వాటిని ప్రజలకు అప్పగించ లేదన్నారు. గ్రామంలో ఆరోగ్య కేంద్రాన్ని, లైబ్రరీని, జిమ్నాజియంను ఏర్పాటు చేయడం తన లక్ష్యమన్నారు. జాతీయ రహదారికి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో తమ గ్రామం ఉంటుందని, అక్కడకు బస్సులు చాలా తక్కువగా వున్నాయని తెలిపారు. అందువల్ల మూడు నాలుగు ఎలక్ట్రిక్‌ రిక్షాలు పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. గ్రామాభివృద్ధిలో సత్యేషా విజయవంత మవుతారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి హిమంత్‌ భట్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -