నవతెలంగాణ-హైదరాబాద్: గతేడాది బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా అమానుష చర్యలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నేడు తీర్పు వెలువరించనున్న విషయం తెలిసిందే. ఐసీటీ తీర్పుకు ముందు తన మద్దతుదారులను ఉద్దేశించి హసీనా మాట్లాడారు.
‘కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దు. నేను బతికే ఉన్నాను. బతికే ఉంటాను. మళ్లీ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తాను. బంగ్లాదేశ్ గడ్డపై న్యాయం చేస్తాను’ అని తెలిపారు. ‘తీర్పు రానివ్వండి. తీర్పు గురించి నాకు ఎలాంటి పట్టింపూ లేదు. నేను అలాంటి తీర్పులకు భయపడను. అల్లా నాకు జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని తీసుకుంటాడు. కానీ నేను నా దేశ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను. నేను నా తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయా. వారు నా ఇంటిని తగలబెట్టారు’ అని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు.
యూనస్ ప్రభుత్వం తన పార్టీ అయిన అవామీ లీగ్ను పూర్తిగా నాశనం చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘మా పార్టీని నాశనం చేయడం అంత సులభం కాదు. అవామీ లీగ్.. అధికార దురాక్రమణదారుల జేబుల్లోంచి వచ్చిందికాదు. అట్టడుగు స్థాయి నుంచి పుట్టుకొచ్చింది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
అవామీ లీగ్ పాలనలో దోపిడీలు, నేరాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా షేక్ హసీనా తెలిపారు. అయితే, ఇప్పటి తాత్కాలిక ప్రభుత్వ హయాంలో నేరగాళ్లు హీరోలు అవుతున్నారని.. తనపై కుట్రలు పన్ని తప్పుడు కేసులు నమోదు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.



