– 38 మంది పాలస్తీనియన్ల మృతి
– ఇజ్రాయిల్ దాష్టీకాలను ఖండించిన ఐక్యరాజ్య సమితి
గాజా: గాజాలో పాలస్తీనియన్లకు ఆహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాలపై ఇజ్రాయిల్ సోమవారం మరోసారి దాడులకు తెగబడింది. రఫా సమీపంలోని సహాయ కేంద్రాల వద్ద ఆహారం కోసం వేచి వున్న వారిపై ఇజ్రాయిల్ దళాలు జరిపిన కాల్పుల్లో 38 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాకు అందుతున్న మానవతావాద సాయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. గాజాలో ఆహార సంక్షోభం తీవ్రమవుతోంది. నిస్సహాయులైన పాలస్తీనియన్లు ఆకలి బాధతో సహాయ కేంద్రాల వద్ద వేలాదిగా బారులు తీరుతున్నారు. వారిని చెదరగొట్టేందుకు, నియంత్రించేందుకు ఇజ్రాయిల్ దళాలు కాల్పులు జరిపాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అమెరికా, ఇజ్రాయిల్ మద్దతుతో ఈ సహాయ కేంద్రాలను వివాదాస్పద గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) నిర్వహిస్తోంది. కాగా ఉత్తర గాజాలో ఆహారం కోసం వేచివున్న మరో ముగ్గురు కూడా ఇజ్రాయిల్ దాడుల్లో చనిపోయారు. గాజా నగరంపై జరిగిన దాడిలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
భయానకం : ఐక్యరాజ్య సమితి
గాజాలో ఇజ్రాయిల్ దాష్టికాలను ఐరాస హక్కుల విభాగం అధిపతి ఓల్కర్ టర్క్ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ చర్య భయానకంగా ఉన్నదని, ఆహారం కోసం అలమటిస్తూ, నిస్సహాయులైన పాలస్తీనియన్లపై వరుసగా దాడులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆహారాన్ని ఇజ్రాయిల్ ఒక ఆయుధంగా వాడుతోందని విమర్శించారు. ప్రాణాధార సామగ్రిని అడ్డుకోవడాన్ని ఖండించారు. ఇజ్రాయిల్ జరుపుతున్న ఈ క్రూరమైన దాడులపై తక్షణమే నిస్పాక్షిక విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా గత 20మాసాలుగా కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడుల్లో 55,362 మంది చనిపోయారని, వీరిలో వేలాది మంది చిన్నారులు కూడా ఉన్నారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆహారం, మందులు, ఇతర అత్యవసర సామగ్రి రవాణాపై విధించిన ఆంక్షలను ఇజ్రాయిల్ పాక్షికంగా ఎత్తివేయడంతో గత నెల చివరి నుండి జీహెచ్ఎఫ్ వాటి పంపిణీని ప్రారంభించింది. అయితే ఐరాస, ఇతర మానవతావాద గ్రూపులు జీహెచ్ఎఫ్కు సహకరించేందుకు నిరాకరించాయి. మానవతావాద అవసరాల కంటే ఇజ్రాయిల్ సైనిక లక్ష్యాలకే అది ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించాయి.
గాజా ఆహార కేంద్రాలపై కాల్పులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES