నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో, అతడిని మెరుగైన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో 33వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్షిత్ రాణా బౌలింగ్లో బ్యాటర్ అలెక్స్ కేరీ కొట్టిన బంతి గాల్లోకి లేచింది. బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్, పరిగెత్తుతూ డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఈ క్రమంలో కిందపడటంతో అతడి ఎడమ పక్కటెముకలకు గాయమైంది.
క్యాచ్ పట్టిన వెంటనే అయ్యర్ నొప్పితో విలవిలలాడాడు. టీమ్ ఫిజియో కమలేష్ జైన్, సహచర ఆటగాళ్ల సహాయంతో అయ్యర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు. “ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకలకు గాయమైంది. గాయం తీవ్రతను అంచనా వేయడానికి అతడిని ఆసుపత్రికి తరలించాం” అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.



