నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకాశ్మీర్లో చేపట్టిన ఆపరేషన్ కెల్లర్లో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సమన్వయంతో కెల్లార్, షోపియాన్, ట్రాల్ల్లో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు కాశ్మీర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.కె.బిర్డి తెలిపారు. శుక్రవారం అవంతిపొరాలో భద్రతా దళాల సంయుక్త సమావేశంలో వి.కె. బిర్డి, మేజర్ జనరల్ ధనుంజరు జోషిలు మాట్లాడారు. 48 గంటల్లో రెండు విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించారని బిర్డి పేర్కొన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈప్రాంతంలో మోహరించిన అన్ని భద్రతా దళాలు తమ వ్యూహాలను సమీక్షించాయని అన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి కట్టుబడి ఉన్నామని మేజర్ జనరల్ జోషి పేర్కొన్నారు. మృతిచెందిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన షాహిద్ కుట్టారు రెండు ప్రధాన దాడుల్లో పాల్గొన్నాడని అన్నారు. వాటిలో జర్మన్ పర్యాటకుడిపై దాడి ఒకటని అన్నారు.