Tuesday, June 24, 2025
E-PAPER
Homeజాతీయంగగన విషాదం

గగన విషాదం

- Advertisement -

– అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్‌ ఇండియా విమానం
– టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ప్రమాదం
– 242 మంది దుర్మరణం
– మృతుల్లో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది
– బ్రిటన్‌ వెళుతుండగా దుర్ఘటన
– గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కన్నుమూత
– ప్రముఖుల దిగ్భ్రాంతి
– కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
అహ్మదాబాద్‌:
గుజరాత్‌లో మాటలకందని పెను విషాదం చోటుచేసుకుంది. ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ విమానం గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయి పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల నివాస ప్రాంతాలపై కుప్పకూలింది. బయలుదేరిన తొమ్మిది నిమిషాలకే విమానం మంటల్లో చిక్కుకొని కూలడంతో నగరమంతా దట్టమైన నల్లని పొగ వ్యాపించింది. లండన్‌ బయలుదేరిన ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ భారీగానే ప్రాణనష్టం జరిగి ఉంటుందని అంచనా. అయితే ప్రమాదంలో ఎవరూ బతికి బట్టకట్టే అవకాశం లేదని, ప్రయాణికులందరూ మరణించారని పోలీసులు ధృవీకరించారు. క్షతగాత్రులకు వివిధ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. విమాన ప్రయాణికులలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజరు రూపానీ కూడా ఉన్నారని తెలుస్తోంది. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు బయలుదేరిన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ ట్విన్‌ జెట్‌ కొద్దిసేపటికే మేఘనీనగర్‌ ఘోడాసర్‌ ప్రాంతంలోని బీజీ వైద్య కళాశాల వసతిగృహంపై కూలిపోయింది. ప్రమాదంలో అనేక మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. భోజన సమయం కావడంతో పలువురు విద్యార్థులు హాస్టల్‌లోనే ఉన్నారు. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ జాతీయులు, ఏడుగురు పోర్చుగీసు వారు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక అగ్నిమాపక, ఎమర్జెన్సీ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాల లో భాగస్వాములయ్యారు. విమాన ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు అధికారులు, మంత్రులను సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో పైలెట్‌ సుమిత్‌ సభర్వాల్‌, కో-పైలట్‌ క్లైవ్‌ కుందర్‌ డ్యూటీలో ఉన్నారు. వీరిద్దరూ అనుభవజ్ఞులే. సభర్వాల్‌కు 8,200 గంటలు, కుందర్‌కు 1,100 గంటలు విమానాలను నడిపిన అనుభవం ఉంది. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ అందించిన సమాచారం ప్రకారం ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏ1-171 విమానం లండన్‌లోని గట్విక్‌ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఆ వెంటనే విమాన సిబ్బందిని సంప్రదించేందుకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ’23వ రన్‌వే నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే ఎయిర్‌పోర్ట్‌ వెలుపల జనావాసాలపై కూలిపోయింది. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి’ అని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. కూలడానికి ముందు విమానం ప్రమాద సంకేతంగా ‘మేడే కాల్‌’ జారీ చేసింది. ఆ తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ), ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) విచారణ చేపట్టాయి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హుటాహుటిన అహ్మదాబాద్‌ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద నేపథ్యంలో అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను తాత్కాలికంగా కొంతసేపు నిలిపివేశారు. విమానం 174 నాట్స్‌ వేగంతో ప్రయాణిస్తూ 625 అడుగుల (190.5 మీటర్లు) ఎత్తులో సిగల్స్‌ కోల్పోయి వేగంగా కిందికి పడిపోయింది. వీటీ-ఏఎన్‌బీ రిజిస్ట్రేషన్‌ కలిగిన ఈ విమానాన్ని 2014లో ఎయిర్‌ ఇండియాకు సరఫరా చేశారు. ప్రపంచంలో గతంలో బోయింగ్‌ 787 విమానాలు ప్రమాదానికి గురైన దాఖలాలేవీ లేవు. ఈ మోడల్‌ విమానాలకు భద్రతా పరంగా మంచి రికార్డు ఉంది. ఎయిర్‌ ఇండియా నడుపుతున్న 27 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైన్స్‌ జెట్లలో ఇది ఒకటి. ప్రమాదానికి గురవడానికి ముందు ఈ విమానం న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చింది. గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఎయిర్‌ ఇండియా విమానం భారీ ప్రమాదానికి గురవడం ఇదే మొదటిసారి. కాగా విమాన ప్రమాదం జరిగిన తర్వాత సుమారు 150 మంది సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని సీఆర్‌పీఎఫ్‌ తెలిపింది. మరోవైపు పశ్చిమ రైల్వే తన రక్షణ దళాన్ని, వైద్య బృందాలను ఘటనా స్థలానికి తరలించింది. సబర్మతిలోని డివిజనల్‌ రైల్వే ఆస్పత్రి, సబర్మతి వర్క్‌షాప్‌, వత్వా, అహ్మదాబాద్‌ నుంచి వైద్యులు, సిబ్బందితో పాటు ఏడు అంబులెన్సులను కూడా పంపారు. అహ్మదాబాద్‌ నుంచి అదనపు రైళ్లను కూడా నడుపుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఆస్పత్రులకు తరలిస్తున్నారని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఆసార్వా సివిల్‌ ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సంతాప సూచకంగా ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ హ్యాండ ిల్స్‌లో నలుపు, నలుపు తెలుపు చిత్రాలను ఉపయోగించారు. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను తీసుకొస్తున్నారని, వాటిలో కొన్ని గుర్తు పట్టడానికి కూడా వీలులేకుండా ఉన్నాయని అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రి ట్రూమా సెంటర్‌ తెలిపింది. బతికి బయటపడిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నదని, తీవ్ర గాయాలతో స్పృహ లేకుండా ఉన్నారని ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కిడ్నీ డిసీజస్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రంజల్‌ మోడీ చెప్పారు. ‘రోగులలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని గుర్తించే పరిస్థితి కూడా లేదు. ముఖాలు మాడిపోయాయి. చర్మం చాలా వరకూ కాలిపోయింది. వారు స్పృహలో లేరు. వారిని బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన తెలిపాశారు. కొందరి శరీరాలపై ఇప్పటికీ సీట్‌బెల్టులు ఉన్నాయని అంటూ అలాంటప్పుడు వారి జేబులు ఎలా వెతకగలం అని అన్నారు. ఇదిలావుండగా ఆనంద్‌ వంటి సమీప జిల్లాలు, గుజరాత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు ఆస్పత్రి వద్ద ఆత్రుతగా ఎదురు చూస్తూ తమ వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన సోదరుడు స్వప్నిల్‌ సోనీ, అతని భార్య యోగా, వదిన ఆల్ఫా సోనీ కూడా విమానంలో ఉన్నారని అహ్మదాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త తృప్తి సోనీ చెప్పారు. ఆస్పత్రి వద్ద ఉన్నానని, ఇంకా ఏ సమాచారము తెలియలేదని ఆయన అన్నారు.

ప్రమాదం జరిగిందిలా!
బోయింగ్‌ 787-8 ఎయిర్‌ ఇండియా విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాల్లోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది.

గతంలో భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాల వివరాలు
1990 : ఫిబ్రవరిలో బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 605 రన్‌వేను తాకడంతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 146 మంది ప్రయాణి కులు, 92 మంది సిబ్బంది చనిపోయారు.
1996లో హరియాణాలో సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌ విమానం 763, కజికిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 1907 ఢకొీన్నాయి. సమా చారం లోపం కారణం జరిగిన ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో 340 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది మరణించారు.
1998 : జులైలో ఆలయన్స్‌ ఎయిర్‌ ఫ్లైట్‌ బోయింగ్‌ 737-2A8 విమానం ల్యాండింగ్‌ సమయంలో అదుపు తప్పి జనాలు ఉన్న పాంత్రంలోకి దూసుకెళ్లింది. బీహార్‌లోని పట్నా విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు, ఐదుగురు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు.
2010 : మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఐఎక్స్‌-812 కుప్పకూలింది. 166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబారు నుంచి మంగళూరుకు రాగా సకాలంలో రన్‌వేపై ఆగకుండా లోయలోకి దూసుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగి 158 మంది మతి చెందారు. 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
1993 : ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం టేకాఫ్‌ సమయంలో రన్‌వేపైకి వచ్చిన ట్రక్కును ఢకొీట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగి 118 మంది ప్రయాణికులు, 55 మంది సిబ్బంది (గ్రౌండ్‌ సిబ్బందితో కలిపి) ప్రాణాలు కోల్పోయారు.
2020లో : కరోనా మహమ్మారి సమ యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేం దుకు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా బోయింగ్‌ 737-800 విమానం దుబారు నుంచి కేరళలోని కోజికోడ్‌కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా అదుపుతప్పి 30 అడుగుల లోయలో పడి విమానం రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా
గాయపడ్డారు.
ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి
అహ్మదాబాద్‌లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద వార్త తెలియగానే యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు, మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం, నేపాల్‌ మాజీ ప్రధాని ప్రచండ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రభృతులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఈయూ : అత్యంత హృదయవిదారకమైన ఈ ప్రమాదం గురించి తెలియగానే మనస్సు కలిచివేసింది. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు యురోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా పేర్కొన్నారు.
మాల్దీవులు: భారత్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తెలిపారు.ఈ సమయంలో భారత ప్రజలకు, ప్రభుత్వానికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.
జెలెన్‌స్కీ: భారత్‌లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగించింది. భారతీయులతోపాటు బ్రిటన్‌ సహా పలు దేశాల పౌరులు కూడా మరణించడంపై చింతిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మలేసియా: ఈ సమయంలో బాధితుల కోసమే తాము ప్రార్థిస్తున్నామని మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం వ్యాఖ్యానించారు. భారత్‌ విచారాన్ని తాము పంచుకుంటున్నామని, పూర్తి బాసటగా నిలుస్తామని చెప్పారు.
ప్రచండ: జరిగిన విషాదంతో తన మనస్సు కలతచెందిందని నేపాల్‌ మాజీ ప్రధాని ప్రచండ పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలన్నీ బాధితుల చుట్టూ పరిభ్రమిస్తున్నాయన్నారు.

ముమ్మరంగా సహాయచర్యలు
కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
– గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడిన అమిత్‌ షా

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విమాన ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు చుట్టు పక్కల భవనాలకు విస్తరించాయి. ఘటన జరిగిన ప్రాంతానికి పెద్దఎత్తున అంబులెన్స్‌లను తరలించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు ఘటనాస్థలిలో సహాయ చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 90 మంది చొప్పున మూడు బృందాలుగా సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్‌ సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.మరోవైపు ప్రమాదంపై కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అంతకుముందు అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన తీవ్రంగా కలచివేస్తోందంటూ గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ విచారం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన తక్షణ చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స కోసం ఘటనాస్థలి నుంచి గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స ప్రాధాన్యతా క్రమంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు.

భయానకం చెల్లాచెదురుగా మృతదేహాలు, శకలాలు
ప్రత్యక్షసాక్షుల కథనం

విమానం కూలిన ప్రదేశం వద్ద పరిస్థితి భయానకంగా ఉన్నదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మృతదేహాలు, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని వారు చెప్పారు. ‘నేను ఇంటిలో ఉండగా పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు బయటకు రాగానే దట్టమైన పొగ వ్యాపించి ఉంది’ అని ఓ వ్యక్తి పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. ఎక్కడ చూసినా ప్రమాదంలో మరణించిన వారి శరీరాలు, విమాన శకలాలే కన్పించాయని ఆయన చెప్పారు. తన కుమారుడు ఉంటున్న ఓ హాస్టల్‌ భవనంపై విమానం కూలిపోయిందని మరో వ్యక్తి అన్నారు. ‘భోజన విరామ సమయంలో నా కుమారుడు హాస్టల్‌కు వెళ్లాడు. అక్కడే విమానం కూలింది. అయితే నా కుమారుడు సురక్షితంగానే ఉన్నాడు. రెండో అంతస్థు నుంచి కిందికి దూకడంతో కొన్ని గాయాలయ్యాయి’ అని రమీలా తెలిపారు. కాగా ప్రమాద వార్త తెలియగానే హుటాహుటిన విజయవాడ నుండి అహ్మదాబాద్‌ చేరుకున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుతో ప్రధాని మోడీ మాట్లాడారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచిస్తూ అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత విభాగాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయని, సమన్వయంతో పనిచేస్తున్నాయని నాయుడు కార్యాలయం తెలిపింది.

మృత్యుంజయుడు రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌
విమాన ప్రమాదం నుంచి సురక్షితంగా…
ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ నుంచి బయటకు : అహ్మదాబాద్‌ సీపీ నిర్ధారణ

ఈ విమాన ప్రమాదంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ నుంచి బయట పడి రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ మృత్యుంజయుడైౖనట్టు అహ్మదాబాద్‌ సీపీ జీఎస్‌ మాలిక్‌ తెలిపారు. విమానంలో 11ఏ నంబర్‌ సీటులో కూర్చున్న ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.భారత సంతతికి చెందిన ఆయన బ్రిటన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమాన ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడే ఏమీ చెప్పలేమనీ, నివాస ప్రాంతంలో కూలినందువల్ల సంఖ్య ఎక్కువే ఉండే అవకాశముందనిన్న అన్నారు.

మాటలు రావట్లేదు
”అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందా. ఇది హృదయ విదారక ఘటన. దీనిపై మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుంది”.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా
”ఈ ప్రమాద విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదం. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా”.
ప్రధాని మోడీ

  • సత్వరమే చర్యలు చేపట్టాలి
  • ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలి. పార్టీ ఆలోచనల్లో బాధితులు, వారి కుటుంబాలే ఉన్నాయి.
  • – సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

హృదయం ముక్కలైంది
”విమాన ప్రమాద వార్త వినగానే హృదయం ముక్కలైం ది. బాధిత కుటుంబాల ఆవేదన వర్ణణాతీతం.ప్రతి ప్రాణం విలువైనదే. సహాయక చర్యలు వేగంగా జరగాలి. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా కాంగ్రెస్‌ కార్యకర్తలు ముందుండాలి”.
– కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -