– సెలవులు మూడ్ లోనే ఉపాధ్యాయులు, విద్యార్థులు
– హాజరు పెంపుకు చర్యలు ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
విజయదశమి దీర్ఘకాలిక సెలవులు ముగిసి మూడు రోజులు గడిచినా, అశ్వారావుపేట మండలంలోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ఇంకా పూర్తి స్థాయికి రాలేదు. 13 రోజుల పాటు కొనసాగిన దసరా సెలవుల అనంతరం శనివారం పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంకా సెలవు మూడ్ నుండి బయటపడలేకపోతున్నారు. మండలంలోని పలు పాఠశాలలను సోమవారం నవతెలంగాణ సందర్శించింది. ఈ సందర్శనలో విద్యార్ధుల హాజరు శాతం తక్కువగా నమోదవడం, ఉపాధ్యాయులు ఎక్కువమంది హాజరైనప్పటికీ విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గింది.
పాఠశాల వారీ హాజరు వివరాలు:
ఎంపీయూపీఎస్ ఊట్లపల్లి: 97 మంది విద్యార్థుల్లో శనివారం 9, సోమవారం 60 మంది హాజరు. 7 మంది ఉపాధ్యాయుల్లో 6 మంది హాజరు.
ఎంపీపీఎస్ వినాయకపురం: 93 మంది విద్యార్థుల్లో శనివారం 15, సోమవారం 35 మంది హాజరు. 4 మంది ఉపాధ్యాయుల్లో 2 మంది మాత్రమే హాజరు.
ఎంపీపీ ఎస్ ఆసుపాక కాలనీ: 32 మంది విద్యార్థుల్లో శనివారం 15, సోమవారం 26 మంది హాజరు.ఇరువురు ఉపాధ్యాయుల్లో ఒక్కరు మాత్రమే హాజరు.
ఎంపీపీ ఎస్ కుడుములుపాడు: 35 మంది విద్యార్థుల్లో శనివారం 4, సోమవారం 15 మంది హాజరు.ఇరువురు ఉపాధ్యాయుల్లో ఒక్కరు మాత్రమే హాజరు.
ఎంపీయూపీఎస్ నందిపాడు: 106 మంది విద్యార్థుల్లో శనివారం 52, సోమవారం 46 మంది హాజరు. 8 మంది ఉపాధ్యాయుల్లో 5 మంది హాజరు.
మొత్తం మీద విద్యార్థుల హాజరు శాతం సగటున 50 నుండి 55 శాతం, ఉపాధ్యాయుల హాజరు 65 శాతం పైగా ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలిక సెలవుల అనంతరం విద్యార్థులు మళ్లీ పాఠశాల వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని విద్యా వేత్తలు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పాఠశాలల్లో ఆకర్షణీయమైన కార్యక్రమాల లోపం కూడా హాజరు పై ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొన్నారు.
హాజరు శాతం పెంచేందుకు విద్యాధికారులు పాఠశాలల స్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థుల కోసం ప్రోత్సాహక కార్యక్రమాలు,తల్లిదండ్రుల అవగాహన సమావేశాలు,మొదటి వారంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచనలు చేశారు. దసరా అనంతరం హాజరు తగ్గుదల తాత్కాలికమైనదే అయినప్పటికీ, విద్యా ప్రమాణాలపై దీని ప్రభావం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల హాజరు పెంపు పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి తీసుకోవాల్సిన బాధ్యతగా వారు పేర్కొన్నారు. హాజరు పెంపుకు చర్యలు తీసుకుంటానని ఎంఈఓ ప్రసాదరావు నవతెలంగాణతో తెలిపారు.