– సమ సమాజానికి పునాదులు
– భూభారతి చట్టం ద్వారా పేదల భూ హక్కులు, అస్థిత్వాన్ని కాపాడుతాం
– పీవీ మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తుంది : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్
ప్రధాని ఇందిరాగాంధీ తీసుకువచ్చిన భూ సంస్కరణలను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమలు చేసి, సమ సమాజానికి పునాదులు వేసిన సంఘసంస్కర్త పీవీ నరసింహారావు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకువచ్చిన అనేక సంస్కరణలు సమాజానికి గొప్ప మేలు చేశాయని తెలిపారు. అందరికీ ఒకే రకమైన విద్యాబోధన ఉండాలని ఈ దేశ మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ప్రజాస్వామ్య భావనకు పునాదులు వేశారని సీఎం గుర్తు చేశారు. ఆయన ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆయన ఈ దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను గాడిలో పెట్టారని తెలిపారు. తాకట్టులో ఉన్న దేశ బంగారాన్ని విడిపించి ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలో భారతదేశాన్ని ఒక బలమైన దేశంగా నిలబెట్టారని చెప్పారు. కాంగ్రెస్ పాలన కాలంలో 24 లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో పేదలకు పంపిణీ చేసిన భూములను గత పదేండ్లు పరిపాలించిన వారు ధరణి పేరుతో రకరకాల ఇబ్బందులకు గురిచేసి పేదల భూములను అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. నాడు పంచిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదల అస్తిత్వాన్ని, హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని వివరించారు. పీవీ నరసింహారావు మార్గాన్ని ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిక్కచ్చిగా తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు.
సంఘసంస్కర్త పీవీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES