నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడలోని సింగ్ నగర్లో చోటు చేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ అల్లుడు అత్తను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన అందరిని షాక్కు గురి చేసింది.
సింగ్ నగర్కు చెందిన కోలా దుర్గ కుమార్తెకు నాగసాయితో వివాహం జరిగింది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గొడవల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో భార్యను తనతో కాపురానికి పంపాలని నాగసాయి అత్త కోలా దుర్గను కోరాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో నాగసాయి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. కోపంతో అత్త ఇంటికి వెళ్లిన అతడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో కోలా దుర్గకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
నిందితుడు నాగసాయి స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడని సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నాగసాయిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నాగసాయిపై గతంలోనే అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.



