నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితురాలు సోనమ్ తన భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని ఆమె పోలీసుల విచారణలో ఒప్పకుంది. ఈ మేరకు సిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో సోనమ్ తో పాటు ఇతర నిందితులను బుధవారం షిల్లాంగ్ తీసుకొచ్చారు. అక్కడ సిట్ బృందం వీరిని కేసు గురించి ప్రశ్నించింది. ఆ సమయంలో సోనమ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట రికార్డ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దాన్ని వీడియోటేప్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ఆమె వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఈ రోజే నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నారు.
రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనమ్తో వివాహం జరగ్గా.. 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత కన్పించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనమ్ కోసం గాలించగా.. ఉన్నట్టుండి ఆమె గాజీపుర్లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమే భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.