– తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్
నవతెలంగాణ – కామారెడ్డి
పీడనపై నిప్పురవ్వలు అలిశెట్టి కవిత్వం, బీదల గొంతుకగా సామాన్యుని బతుకు చిత్రాన్ని తన కుంచె ద్వారా గీసిన ప్రజా కవి అలిశెట్టి కవితలు సమాజాన్ని చైతన్యం చేశాయని, చిన్న చిన్న పదాల ద్వారా ఎంతో గొప్ప భావాన్ని చెప్పి తెలుగు సాహిత్య చరిత్రలో అలిశెట్టి ఆదర్శ కవి గా నిలిచారని సమాజం లోని అన్యాయాలను తన కలం ద్వారా ఖండించారని తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. జనవరి 12 సోమవారం ప్రజా కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి కార్యక్రమాన్ని కామారెడ్డి లోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ భవనం లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భం గా తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ బీద అణగారిన వర్గాల ఉన్నతి కి అలిశెట్టి తన అక్షరాలను ఎక్కు పెట్టాడని తన కవితలు ఎంతో ప్రజాదరణ పొందాయని, అలిశెట్టి సాహిత్యం ప్రజా సాహిత్యం గా ప్రజల మనస్సుల్లో నిండిందన్నారు. తాను రచించిన ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్త రేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభగీతం, సిటీ లైఫ్, మరణం, ఇది నా చివరి చరణం కాదు లాంటి రచనలు యువకులను ఆలోచింపజేశాయన్నారు. సామాన్యుని బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన మేటికవి అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల జైత్రయాత్రతో ప్రభావితమై కవితలను రాశాడని బీదవాడిగా పుట్టి బీద వారి కోసం తన అక్షరాలను ఉపయోగించి బీదరికంలోనే కన్నుమూసిన ప్రజా కవి అలిశెట్టి అందరి మనసుల్లో నిలిచారని అలిశెట్టి ప్రభాకర్ జీవితం ఎన్నో ఒడిదొడుకులతో కష్టాలతో నిండి ఉండేదని, అయినప్పటికీ తన కలాన్ని వదలకుండా బలహీనుల పక్షాన తన కలాన్ని నడిపించిన ధైర్యశాలి అలిశెట్టి ప్రభాకర్ అని అన్నారు.
తెరవే ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో పలువురు కవులు అలిశెట్టి ప్రభాకర్ ను కీర్తిస్తూ కవితలను వినిపించారు. పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో తెరవే జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి మోహన్ రాజ్, ఎన్నిల ముచ్చట్లు సమన్వయకర్త ఎనిశెట్టి గంగా ప్రసాద్, తెరవే జిల్లా ఉపాధ్యక్షులు వైద్య శేషారావు, ఫణి కుమార్ , చంద్రశేఖర్ , విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, వెంకటి, బోడ లక్ష్మీపతి , లింగారెడ్డి, విఠల్ రెడ్డి, వీరయ్య, సాయ గౌడ్ రాజమల్లయ్య యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


