– 15 మందిని అరెస్ట్ చేసిన టీజీసీఎస్బీ
– ఐపీ అడ్రస్ ఆధారంగా అదుపులోకి
– అధికారులను అభినందించిన డీజీ శిఖా గోయల్
హైదరాబాద్: చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోన్న పలువురు నిందితులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ), చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (సీపీయూ) ఆధ్యర్యంలో ప్రత్యేక ఆపరేషన్ జరిగింది. ఐపీ అడ్రస్ల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసు వివరాలను టీజీసీఎస్బీ డీజీ శిఖా గోయల్ మీడియాకు వెల్లడించారు. ”సీపీయూతో కలిసి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహించాం. చిన్న పిల్లల వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్, యాదగిరిగుట్ట, జగద్గిరిగుట్టలో 15 మంది నిందితులను అరెస్ట్ చేశాం. నిందితులకు 34 కేసుల్లో పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. సోషల్మీడియాపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పూర్తి నిఘా ఉంటుంది. నిందితులు సెక్సువల్ కంటెంట్ను అప్లోడ్ చేస్తున్నారని గుర్తించాం. వీరంతా 19 నుంచి 50 ఏండ్ల వయసున్న వారే. ఎక్కువ మంది మధ్యతరగతి వర్గానికి చెందినవారే. ఎక్కువగా విదేశీ వ్యక్తులకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు అనుమానం ఉన్నది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. బాధితులంతా 6 నుంచి 14 ఏండ్ల వయసు వారే. 90 శాతం కంటెంట్ బాలికలకు సంబంధించినదిగా గుర్తించబడింది. చిన్న పిల్లలకు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం” అని డీజీ శిఖా గోయల్ హెచ్చరించారు. అరెస్టయిన నిందితు లను రిమాండ్కు పంపించినట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి నేర మాఫియాలను బహిర్గతం చేయటం కోసం దర్యాప్తు కొనసాగుతున్నదని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, బాలలపై ఆన్లైన్ వేధింపుల విషయాలను వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన ఎస్పీ హర్షవర్ధన్, డీఎస్పీలు ఎన్. వాసు, కె.వి సూర్యప్రకాశ్, కె.వి.ఎం ప్రసాద్, వై.వెంకటేశ్వర్లు, నర్సింహారెడ్డి, ఇతర టీజీసీఎస్బీ అధికారులను శిఖా గోయల్ అభినందించారు.
‘చైల్డ్ పోర్న్’ నిందితులపై ప్రత్యేక ఆపరేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES